హైదరాబాద్: టెస్టు క్రికెట్లో కోహ్లీని గ్రేట్ అనలేమని, అయితే ప్రపంచంలో అత్యుత్తమ వన్డే క్రికెటర్ అనొచ్చని బ్యాటింగ్ లెజెండ్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్కి ఇచ్చిన ఇంటర్యూలో రికీ పాంటింగ్ కోహ్లీ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు.
ఫోటోలు: వచ్చిన వెంటనే ఉప్పల్లో రంగంలోకి దిగిన కోహ్లీ
'ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా విరాట్ కోహ్లినే. అందులో వేరే ప్రశ్నకు తావే లేదు' అని పాంటింగ్ అన్నాడు. గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్న కోహ్లీని వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పాడు.

గత ఆరు లేదా ఏడు నెలల కోహ్లీకి, ఇప్పటి కోహ్లి ఎంత తేడా ఉందో చూస్తే అతనే అత్యుత్తమ క్రికెటర్ అనే విషయం తెలుస్తుందని పాంటింగ్ అన్నాడు. ఇందులో చెప్పడానికి ఏమీ లేదని, రోజు రోజుకీ కోహ్లీ ఎంతగానో పరిణితి చెందుతున్నాడని పాంటింగ్ అన్నాడు.
రాబోయే రోజుల్లో కోహ్లీ ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని పాంటింగ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్ విషయానికి వస్తే కోహ్లీనే అత్యుత్తమ క్రికెటర్ అని పాంటింగ్ తేల్చి చెప్పాడు. అయితే దిగ్గజ క్రికెటర్లతో కోహ్లీని పోల్చాల్సిన సమయం ఇంకా రాలేదని చెప్పాడు.
గ్రేట్ ప్లేయర్లుగా భావించే సచిన్, లారా, కల్లిస్ లాంటి ఆటగాళ్లు 120, 130 నుంచి 200 వరకు టెస్టు మ్యాచ్లాడిన సందర్భాన్ని గుర్తుచేశాడు. అయితే కోహ్లీ కెరీర్ మధ్యలోనే ఉన్నందున ఆల్ టైమ్ గ్రేట్ల సరసన కోహ్లీని చేర్చకపోవడమే మంచిదని పాంటింగ్ అన్నాడు.
మైదానంలో కోహ్లీ దూకుడుగా ఆడే స్వభావం ఎంతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలని పాంటింగ్ అన్నాడు. మైదానంలో కోహ్లీ చూపించే క్యారెక్టర్ చూస్తుంటే తనలాగే ఉంటుందని పాంటింగ్ పేర్కొన్నాడు.