
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. సాకర్ను ఫాలో అవడమే కాకుండా.. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన తన సహచర ఆటగాళ్లతో కలిసి ఫుట్బాల్ ఆడుతుంటాడు. ట్రైనింగ్ సెషన్స్లో ఫుట్బాల్తో వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తుంటాడు. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో ఎఫ్సీ గోవా జట్టుకు కోహ్లీ సహ యజమానిగా కూడా ఉన్నాడంటే ఈ ఆటంటే అతనికి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. ఫండ్ రైజింగ్ కార్యక్రమాల నిర్వహణ కోసం కోహ్లీ ఎన్నో ఫుట్బాల్ మ్యాచుల్లో పాలుపంచుకున్నాడు.
అయితే, ఫుట్బాల్ ఆడటంలో తనకున్న ప్రావీణ్యాన్ని తెలియజేస్తూ తాజాగా కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని పోస్టు చేశాడు. దీనికి 'యాక్సిడెంటల్ క్రాస్బార్ చాలెంజ్'అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో ఔట్సైడ్ బాక్స్ నుంచి కోహ్లీ కొట్టిన ఓ ఫ్రీ కిక్కు బాల్.. గోల్ కీపర్ డైవ్ చేసినా అందకుండా క్రాస్బార్కు తగిలి కొద్దిలో గోల్ మిస్సయింది. అనంతరం తన షాట్ను తానే నమ్మడం లేదన్నట్లుగా కోహ్లీ ముఖంపై రెండు చేతులు ఉంచుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
అయితే, ఈ వీడియో చూసిన భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ కూడా కోహ్లీ ఫుట్బాల్ స్కిల్స్కు ఫిదా అయ్యాడు. తనకు గురు దక్షిణ(ఫీజు) ఎలా చెల్లిస్తావని కోహ్లీని సరదాగా అడిగాడు. 'మొత్తం కోచింగ్ సెషన్స్ అన్నింటికి కలిపి ఒకే ఇన్వాయిస్ పంపించనా లేక నువ్వే ఈఎంఐ రూపంలో చెల్లిస్తావా'అని ఫన్నీగా ట్వీట్ చేశాడు. దీనికి విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలిలో 'మీరు ఎంజాయ్ చేయండి కెప్టెన్'అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ, కోహ్లీ మంచి స్నేహితులనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం యూకే పర్యటన వెళ్లనున్న కోహ్లీ.. ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో బబుల్లో క్వారంటైన్ పాటిస్తున్నాడు. జూన్-2న ఇంగ్లండ్కు పయనం కానున్న భారత జట్టు అక్కడ మరో 10 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండనుంది. అయితే ఈ 10 రోజుల్లో తొలి 3 రోజులు కఠిన క్వారంటైన్ పాటించనున్న ఆటగాళ్లు.. మిగతా ఏడు రోజులు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంది. జూన్ 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభమవుతోంది.