
లండన్: 'ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి'..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు తన సహచరులతో కోహ్లీ చెప్పిన మాట ఇది. అతను అన్నట్లుగానే మన బౌలర్లు ప్రత్యర్థిని ఒక్కో ఓవర్లో, ఒక్కో బంతికి గుండెలాగిపోయేలా చేస్తూ చివరకు చిరస్మరణీయ విజయాన్నందుకున్నారు. లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్ట్లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఆఖరి రోజు ఆటలో మొదట బ్యాటింగ్లో మెరిసిన భారత బౌలర్లు తిరిగి బౌలింగ్తోనూ బెంబేలెత్తించారు. ఇంగ్లండ్కు ఊహించని షాక్లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు.
చివరి రోజు ఆటలో మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా విరోచిత బ్యాటింగ్తో భారత్ భారీ ఆధిక్యాన్ని అందుకొని డిక్లేర్ చేసింది. దాంతో చివరి రెండు సెషన్లలో భారత విజయానికి 10 వికెట్ల అవసరమవ్వగా.. ఇంగ్లండ్ గెలుపునకు 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మైదానంలోకి దిగేముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుతో మాట్లాడాడు. తన మోటీవేషనల్ స్పీచ్తో ఉత్సాహాన్ని నింపాడు. ఈ 60 ఓవర్లు ఇంగ్లండ్ ఆటగాళ్లకు నరకం చూపించాలనే మాటలు మాత్రం వినిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 51.5 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండటంతో డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ రాబిన్సన్ (9)ను అవుట్ చేసి బుమ్రా బాట వేయగా...ఒకే ఓవర్లో బట్లర్ (25), అండర్సన్ (0)లను పెవిలియన్ పంపించి సిరాజ్ మ్యాచ్ను ముగించాడు. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇక విజయానంతరం మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విజయం అద్భుతమన్నాడు. లార్డ్స్లో 2014లో గెలిచినప్పటికీ.. ఈ విజయం 60 ఓవర్లలోనే దక్కిందన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపుల వల్లే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ పట్టుదలగా పరుగులు చేశారన్నాడు. వారి స్లెడ్జింగ్తోనే 60 ఓవర్లలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయాలని కాంక్ష రగిలిందన్నాడు. 'రెండో ఇన్నింగ్స్లో ఒత్తిడి పెరిగిన తర్వాత షమీ, బుమ్రా అద్భుతంగా ఆడారు. మేం ప్రత్యర్థిని 60 ఓవర్లలో ఆలౌట్ చేస్తామన్న నమ్మకం కలిగింది.
రెండో ఇన్నింగ్స్లో మైదానంలో కవ్వింపులు, టెన్షన్ మాకు సాయం చేశాయి. కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రా, షమి నిలబడ్డ తీరు అద్భుతం. వారికి సెల్యూట్ చేస్తున్నా. వారితో కలిసి బ్యాటింగ్ కోచ్ ఎంతో శ్రమించారు. జట్టుకు మేలు చేయాలన్న కసి వారిలో రగిలింది. వారు చేసిన పరుగులకు విలువ కట్టలేం. లోయర్ ఆర్డర్ పరుగులు చేయడం లేదని కొన్నాళ్లుగా అంటున్నారు. ఇప్పుడు వారు పరుగులు చేయగలమని నిరూపించారు'అని కోహ్లీ పేర్కొన్నాడు.