పార్ల్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) తీవ్రంగా నిరాశపరిచాడు. తొందరపాటు బ్యాటింగ్తో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా పరుగు వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్(24 బ్యాటింగ్), శిఖర్ ధావన్(29) శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ పవర్ ప్లే ముగిసిన వెంటనే టీమిండియా కథ మారింది. బవుమా స్పిన్నర్లను రంగంలోకి దింపగా.. భారత బ్యాట్స్మన్ తడబడ్డారు. దాంతో రన్రేట్ తగ్గింది. ఈ క్రమంలోనే మార్కరమ్ బౌలింగ్లో డీప్ మిడ్వికెట్ మీదుగా భారీ షాట్కు ప్రయత్నించిన శిఖర్ ధావన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
This is the first time a spinner Dismissed Virat Kohli on Duck in ODIs.
— CricketMAN2 (@man4_cricket) January 21, 2022
అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఐదు బంతుల్లోనే ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో తడబడ్డ విరాట్.. అతను వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను కవర్ డ్రైవ్కు ప్రయత్నించగా.. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న బవుమా సునాయసంగా క్యాచ్ పట్టాడు. దాంతో విరాట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ తన వన్డే కెరీర్లో ఓ స్పిన్నర్ బౌలింగ్లో ఇలా డకౌటవ్వడం ఇదే తొలి సారి. దాంతో 64 పరుగులకే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
క్రీజులోకి రిషభ్ పంత్ రాగా.. కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. అయితే రాహుల్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 17 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.