టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో ఔటయ్యాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. 93 పరుగులు వద్ద క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో 84వ శతకాన్ని చేజార్చుకున్నాడు.
రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ బౌలింగ్లో లాంగాన్ దిశగా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అతని ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదిన కోహ్లీ 16 పరుగులు పిండుకున్నాడు. గ్లేన్ ఫిలిప్స్ బౌలింగ్లో క్విక్ సింగిల్ తీసి 44 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆచితూచి ఆడిన కోహ్లీ.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు.

శుభ్మన్ గిల్ ఔటైనా.. శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తనదైన శైలిలో క్విక్ సింగిల్స్, డబుల్స్తో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. అతని జోరు చూసి శతకం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కైల్ జెమీసన్.. మైఖేల్ బ్రెస్వెల్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో విరాట్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు.
జెమీసన్ వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీని కోహ్లీ మిడాఫ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్కు పైకి తాకిన బంతి గాల్లోకి లేవగా.. బ్రేస్వెల్ తన కుడివైపు జరిగి క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టగా.. మైదానం మొత్తం మూగబోయింది. గత ఐదు వన్డే ఇన్నింగ్స్ల్లో కోహ్లీ(74*, 135, 102, 65*, 93) 50+ స్కోర్లు నమోదు చేశాడు.
కోహ్లీ వికెట్తో మూడో వికెట్కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్ ఆఖరి బంతికి జడేజాను ఔట్ చేసిన జెమీసన్.. తన మరుసటి ఓవర్ తొలి బంతికి శ్రేయస్ అయ్యర్(49)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.