మానసికంగా అలసిపోవడంతోనే అంతర్జాతీయ టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కేవలం వన్డే ఫార్మాట్ ఆడటం వల్ల తనకు కావాల్సిన విరామం లభిస్తుందని, దాంతో తన ఆట కూడా చాలా మెరుగైందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం అధికార బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. తన తగిన విరామం లభిస్తుండటంతోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేస్తున్నానని తెలిపాడు. పడిక్కల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెప్పిన కోహ్లీ.. అతని కోసం తన ఆట శైలిని మార్చుకున్నానని వెల్లడించాడు.

'మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. నేనే ఆడిన చివరి ఐపీఎల్ మ్యాచ్ గతేడాది ఫైనల్. కానీ ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో నేను బ్యాటింగ్ చేసిన తీరు ఆ మూమెంటమ్ను కొనసాగించడానికి నాకు ఉపయోగపడింది. నేను నా షాట్స్ మాత్రమే ఆడాను. నా రిథమ్కు ఫిట్నెస్ కోసం పడ్డ కష్టం తోడైతే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని నాకు తెలుసు. ఈ రాత్రి గొప్ప ఆరంభాన్ని ఇచ్చేందుకు, దానిని కొనసాగించేందుకు మాకు దక్కిన గొప్ప అవకాశం ఇది.
గత 15 ఏళ్లుగా విపరీతమైన క్రికెట్ షెడ్యూల్తో నేను బాగా అలసిపోయాను. తక్కువ ప్రాక్టీస్ కంటే.. ఎక్కువగా ఆడి అలసిపోయే ప్రమాదమే నాకు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఒకే ఫార్మాట్ ఆడుతుండటంతో తగిన విశ్రాంతి దక్కుతుంది. దాంతో నేను తాజాగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. నేను ఆడేటప్పుడు 120 శాతం కష్టపడుతాను. నేను ఏ మాత్రం సన్నద్దత లేకుండా బరిలోకి దిగను.

వాస్తవానికి ఈ అదనపు విశ్రాంతి సమయం నన్ను మానసికంగా రిఫ్రెష్ చేస్తుంది. శారీరకంగా ఫిట్గా ఉండి.. మానసికంగా ఉత్సాహంగా ఉన్నంత కాలం అన్నీ అనుకూలిస్తాయి. అప్పుడు జట్టు విజయంలో భాగం కావచ్చు. ఒక ఆటగాడిగా నాకు అదే కావాలి. కేవలం జట్టులో చోటు కోసం కాకుండా.. నిరంతరం రాణిస్తూ జట్టు కోసం శ్రమించడమే ముఖ్యం.
దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆట మొదలైనప్పటి నుంచే అతను అదరగొట్టాడు. పవర్ప్లేలో నేను దూకుడుగా ఆడాలని ప్లాన్ చేసుకున్నా. కానీ అతని ఆట చూశాక.. నా ఆటను మార్చుకున్నా. పడిక్కల్కు ఎక్కువ స్ట్రైక్ ఇచ్చాను. అతను ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను పూర్తిగా లాగేసుకున్నాడు. స్లోయర్ బాల్ను అతను మిడ్-ఆన్ మీదుగా కొట్టిన సిక్స్ చూశాక.. 'నువ్వు అద్భుతంగా ఆడుతున్నావు, ఇలాగే కొనసాగించు' అని చెప్పాను. అతని హెడ్ పొజిషన్, బ్యాలెన్స్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్లా ఉన్నాయి.'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దేవదత్ పడిక్కల్(26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 61), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో విజయంలో కీలక పాత్ర పోషించారు.
