టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దెబ్బకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దిగొచ్చింది. విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధిస్తూ బీసీసీఐ నయా రూల్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనపై విరాట్ కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ రూల్ను సవరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
'విదేశీ పర్యటనల నేపథ్యంలో తీసుకొచ్చిన ఫ్యామిలీ రూల్ను బీసీసీఐ సర్దుబాటు చేసే అవకాశం ఉంది. విదేశీ పర్యటనల సందర్భంగా తమ వెంట కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం ఉండాలనుకునే ఆటగాళ్లు బీసీసీఐ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.'అని విపుల్ కశ్యప్ అనే స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.

సుదీర్ఘ పర్యటనలకు మాత్రమే..
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమవ్వడంతో బీసీసీఐ కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా 10 పాయింట్లతో కూడిన కొత్త గైడ్లైన్స్ను ప్రవేశపెట్టింది. ఈ రూల్స్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధించడం కూడా ఉంది. సుదీర్ఘమైన విదేశీ పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను రెండు వారాలే అనుమతించాలని పేర్కొంది. తక్కువ వ్యవధి పర్యటనలకు కుటుంబ సభ్యులు అవసరం లేదని స్పష్టం చేసింది.
గదిలో కూర్చోని ఏడవాలా?
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఆర్సీబీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. బీసీసీఐ ఫ్యామిలీ రూల్ను తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కుటుంబ సభ్యులు లేకుండా గదిలో ఒంటరిగా కూర్చోని ఏడవాలా? అని ప్రశ్నించాడు. 'మనకు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో ఊరట లభిస్తోంది. ఆ సమయంలో వారి మద్దతు మనందరికి తప్పనిసరిగా కావాలి. దీని గురించి కొంతమందికి వివరించడం కూడా చాలా కష్టం. ఈ విషయం తెలియని వ్యక్తులు కూడా.. క్రికెటర్లను కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన అవసరముందని అంటున్నారు.
అది నన్ను కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయినా పర్యటనలో ఉన్నప్పుడు ఆటలో రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు. ఆట అనేది ఓ బాధ్యత. దాన్ని పూర్తి చేశాకే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాం. నేనైతే బయటకు వెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని, అవకాశాలను ఏ మాత్రం వదులుకోను'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కోహ్లీ కామెంట్స్తో ఈ రూల్స్పై తీవ్ర చర్చ జరిగింది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ రూల్ను మార్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.