
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ కర్ణాటక బ్యాట్స్మన్ 823 రేటింగ్ పాయింట్లతో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు.
ఈ సిరీస్లో రాహుల్ 56 సగటుతో మొత్తం 224 పరుగులు చేసి భారత్ 5-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో 105 పరుగులే చేసిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి 9వ స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయాడు.
టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి వీరిద్దరే టాప్-10లో చోటుదక్కించున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ 11వ స్థానానికి పడిపోయాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్లో 136 పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్మన్ ఇయాన్ మోర్గాన్ 9వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ 879 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఫించ్, మున్రో 3,4 స్థానాల్లో నిలిచారు.
ఇక బౌలింగ్, ఆల్ రౌండర్ కేటగిరీల్లో ఆఫ్గానిస్తాన్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు వరుసగా టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు. ఈ రెండు కేటగిరీల్లో భారత్ ఆటగాళ్లు టాప్-10లో లేకపోవడం గమనార్హం. జట్టు ర్యాంకింగ్స్లో టీమిండియా నాల్గో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ తొలి స్థానంలో ఉండగా, ఆసీస్ రెండో స్థానంలో నిలిచింది.