
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన తాజా టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానం దిగజారి నాలుగో ర్యాంక్కు చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్తో జరిగిన ఆఖరి టెస్ట్లో సెంచరీతో రాణించిన ఆసీస్ యువ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్.. కోహ్లీని వెనక్కు నెట్టి మూడో స్థానాన్ని అందుకున్నాడు.
ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన ఇంగ్లండ్ సారథి జో రూట్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు.
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ మొదటి స్థానాన్ని, ఆసీస్ స్టార్ స్మిత్ రెండో స్థానాన్ని కాపాడుకున్నారు. లబుషేన్ (ఆసీస్) ఓ స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంకుకు ఎగబాకాడు.
బ్యాటింగ్ విభాగంలో ప్రస్తుతం విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, స్మిత్ 891, లబుషేన్ 878, కోహ్లీ 862 పాయింట్లతో కొనసాగుతున్నారు. అలాగే భారత ఆటగాళ్లలో పుజారా ఒకస్థానం మెరుగుపర్చుకుని 7వ స్థానానికి చేరగా రహానె రెండు స్థానాలు దిగజారి 9వ ప్లేస్కు పడిపోయాడు. గబ్బాలో గర్జించిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ 13వ ర్యాంకును అందుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో.. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 760 పాయింట్లతో 8, 757 పాయింట్లతో బుమ్రా 9వ ర్యాంకుకు చేరుకున్నారు. కమిన్స్ తర్వాత బ్రాడ్(ఇంగ్లండ్), వాగ్నర్(న్యూజిలాండ్) వరుసగా టాప్-3లో ఉన్నారు.
ఆల్రౌండ్ విభాగంలో.. ఓ స్థానం కోల్పోయి 419 పాయింట్లతో జడేజా మూడో స్థానానికి దిగజారగా.. అశ్విన్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని 281 పాయింట్లతో ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు . ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ 436 పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. వెస్డిండీస్ టెస్టు సారథి జాసన్ హోల్డర్ 423 పాయింట్లతో రెండో ర్యాంకుకు వచ్చాడు. టీమ్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ టాప్లో ఉండగా.. ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టిన భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్ , సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉన్నాయి.