న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తడబాటు కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో సారథిగా విఫలమైన రోహిత్.. బ్యాటింగ్లో డకౌటయ్యాడు. ఫీల్డింగ్లోనూ సునాయస క్యాచ్ను వదిలేసాడు. రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో రోహిత్ నేలపాలు చేశాడు.
కోహ్లీ అసహనం..
రోహిత్ క్యాచ్ వదిలేయడంతో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని జడేజా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. లాథమ్ ఫ్రంట్ ఫూట్లో ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ అయిన బంతి ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ వైపు దూసుకెళ్లింది.

అప్రమత్తంగా లేని రోహిత్.. బంతిని అందుకోలేకపోయాడు. ఆలస్యంగా డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దాంతో బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. క్యాచ్ వదిలేయడంపై కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ క్యాచ్ పట్టి ఉంటే టామ్ లాథమ్ 68 పరుగుల వద్దే ఔటయ్యేవాడు. ఈ అవకాశంతో అతను 86 పరుగులు చేశాడు.
భారీ లక్ష్యం దిశగా కివీస్..
103 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 53 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. క్రీజులో టామ్ బ్లండెల్(30 బ్యాటింగ్), గ్లేన్ ఫిలిప్స్(9 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆధిక్యం 301 పరుగులకు చేరింది.
అంతకుముందు 16/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38), యశస్వి జైస్వాల్(30), శుభ్మన్ గిల్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.