
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు వామికా ఫొటో నెట్టింట ప్రత్యక్షమైంది. గతేడాది కాలంగా ఆమెను మీడియా కంటపడకుండా.. ఫొటోలు రిలీజ్ చేయకుండా దాస్తున్న కోహ్లీ-అనుష్కల ప్రయత్నం భగ్నమైంది. సౌతాఫ్రికా పర్యటనకు విరాట్ కోహ్లీ సతీసమేతంగా వెళ్లగా.. వామికా రూపం మీడియాకు చిక్కింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ ఫొటోలో వామికా పూర్తి ముఖం కనిపించకున్నా.. ఆ చిన్నారి కళ్లు, ముక్కు మాత్రమే కనిపిస్తుంది. మీడియా కంటపడకుండా అనుష్క వామికాను అదిమి పట్టడంతో చిన్నారి రూపం సగమే కెమెరాలకు చిక్కింది.
అయితే ఫొటోగ్రాఫర్లపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'దయచేసి.. పాప ఫొటో మాత్రం తీయకండి'అని మర్యాదపూర్వకంగానే స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. విరాట్ మాటలను ఏ మాత్రం పట్టించుకోని పాపరాజీలు(ఫొటోగ్రాఫర్లు)... వామికా ఫొటో కోసం శతవిధాల ప్రయత్నించారు. ఇక నెట్టింట వైరల్ అవుతున్న వామికా ఫొటో చూసి నెటిజన్లు అచ్చం కోహ్లీలానే ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న పుట్టిన వామికా.. సౌతాఫ్రికా పర్యటనలోనే తొలి బర్త్డే జరుపుకోనుంది.
అయితే పుట్టినప్పటి నుంచి తన కూతురిని మీడియాకు దూరంగా ఉంచాలని భావించిన విరుష్క దంపుతులు.. మీడియా చానెళ్లన్నటికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పాపరాజీలను కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు. అయితే వామికా పుట్టి ఏడాది గడుస్తున్నా ఆమె ఫొటో బయటకు రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తిరేగింది. ఆమె ఫొటో కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
పాప మొదటి పుట్టినరోజైనా వామికాను తమకు చూపించండి అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద క్యాంపైన్ రన్ చేశారు. ఈ క్రమంలోనే వామికా ఫొటో కోసం పాపరాజీలు తెగ ప్రయత్నించి.. చివరకు సగం ఫొటో సాధించారు.
అయితే సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న వామికా ఫొటోపై ఎలాంటి స్పష్టత అయితే లేదు. అది నిజమైన ఫొటోనేనా? లేక ఫేక్ అని తెలియదు. సౌతాఫ్రికాతో మూడో టెస్ట్.. విరాట్ కోహ్లీ కెరీర్లో 100వ టెస్ట్ కాగా.. అదే రోజు వామికా మొదటి బర్త్డే జరుపుకోనుంది. ఇక ఇప్పటికే టీ20 కెప్టెన్సీని వదిలేసిన కోహ్లీని.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారత క్రికెట్లో అగ్గిని రాజేసింది. నిన్నటి వరకు రోహిత్ X విరాట్గా ఉన్న పరిస్థితి.. ఇప్పుడు కోహ్లీ X బీసీసీఐగా మారింది. టీ20 కెప్టెన్సీ వదులు కోవద్దని తాను కోహ్లీని పర్సనల్గా రిక్వెస్ట్ చేశానని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పగా.. అలాంటిదేమి జరగలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
టీ20 కెప్టెన్సీపై పునరాలోచన చేయాలని తనను ఎవరూ కోరలేదని సౌతాఫ్రికా పర్యటనకు ముందు బుధవారం జరిగిన ప్రెస్మీట్లో విరాట్ కోహ్లీ కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ మార్పుపై కూడా తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీతో సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్గా మాత్రమే ఉన్న విరాట్ కోహ్లీ.. సఫారీ గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు. డిసెంబర్ 26 నుంచి జోహన్నస్ బర్గ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.