
న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో డకౌట్ అయిన కోహ్లీ.. వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించాడు.
మహరాజ్ బౌలింగ్లో పరుగుల ఖాతా తెరవకుండానే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో వన్డే క్రికెట్లో కోహ్లీ 14వ సారి డకౌటయ్యాడు. ఓపెనర్ నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేసే వన్డేల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లలో సచిన్ తెందూల్కర్ (20), యువరాజ్ సింగ్ (18), సౌరభ్ గంగూలీ (16) ముందున్నారు. తర్వాత సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్తోపాటు విరాట్ కోహ్లీ (14) జాబితాలోకి చేరాడు. ఆ తర్వాత 13 సార్లు డకౌట్ అయిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలు ఉన్నారు.
ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధికసార్లు డకౌట్ అయిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ తర్వాత స్థానంలో నిలిచాడు కోహ్లీ. లిటిల్ మాస్టర్ తన కెరీర్లో 34సార్లు డకౌట్ కాగా.. కోహ్లీ 31సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. సెహ్వాగ్ కూడా 31 డకౌట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత గంగూలీ (29), యువరాజ్ సింగ్ (26) ఉన్నారు.
సౌతాఫ్రికా గడ్డపై అడుగు పెట్టే ముందు రెండు ఫార్మాట్స్లోనూ విజేతగా నిలిచేలా పటిష్టంగా కనిపించిన భారత జట్టు చివరకు పేలవ ప్రదర్శనతో రెండు సిరీస్లూ కోల్పోయింది. టెస్టు సిరీస్ను 1-2తో చేజార్చుకున్న టీమిండియా మ్యాచ్ మ్యాచ్కు మరింత చెత్త పెర్ఫామెన్స్ కనబర్చి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్నూ చేజార్చుకుంది. తొలి పోరుకు దాదాపు రీప్లేలా కనిపించిన రెండో వన్డేలోనూ రాహుల్ సేన సునాయాసంగా తలవంచింది.
పసలేని బ్యాటింగ్తో ముందుగా సాధారణ స్కోరుకే పరిమితం కాగా... ఆపై బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. మరోవైపు సమష్టిగా చెలరేగిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకొని సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 85), రాహుల్ (79 బంతుల్లో 4 ఫోర్లతో 55) అర్ధ సెంచరీలు చేశారు.
అనంతరం సౌతాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్మన్ మలాన్ (108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 91), 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డి కాక్ (66 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 78) తొలి వికెట్కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్ ఆదివారం కేప్టౌన్ వేదికగా జరుగుతుంది.