టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్గా నిలిచాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.. బుధవారం బెంగళూరులోని బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్సెలెన్స్ మైదానం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో శతకంతో చెలరేగాడు. 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131 పరుగులు చేసాడు.
ఈ మ్యాచ్ ద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో కోహ్లీ 16 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 343 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 16130 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ కంటే ముందు ఏడుగురు బ్యాటర్లు ఉన్నారు.
భారత్ తరఫున 308 అంతర్జాతీయ వన్డేల్లో 53 శతకాలు, 76 హాఫ్ సెంచరీలతో సాయంతో 14,557 పరుగులు చేసిన కోహ్లీ.. ఢిల్లీ తరఫున 14 విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ల్లో 5 శతకాలు, 3 హాఫ్ సెంచరీలతో సహా 950 పరుగులు చేశాడు.

అయితే లిస్ట్-ఏ క్రికెట్లో ఇంగ్లండ్కు చెందిన గ్రాహం కూచ్ లిస్ట్ ఏ క్రికెట్లో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. 1973-97 మధ్య అతను 613 మ్యాచ్లు ఆడి 22,211 పరుగులు చేశాడు. ఇంగ్లండ్కే చెందిన గ్రాహం హిక్ 651 మ్యాచ్ల్లో 22,059 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1989-2012 మధ్య 551 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 21.999 పరుగులు చేశాడు. ఇందులో 18426 పరుగులు అంతర్జాతీయ వన్డేల్లో సాధించాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 529 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 19,456 పరుగులు, విండీస్ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ 1973-1993 మధ్య 500 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 16,995 పరుగులు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 456 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 16363 పరుగులు చేశాడు. వెస్టిండీస్కు చెందిన గోర్డాన్ గ్రీనిడ్జ్ 440 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 16349 పరుగులతో కోహ్లీ కంటే ముందున్నారు.
గత ఐదు వన్డే మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీకి ఇది మూడో శతకం కావడం గమనార్హం. లిస్ట్-ఏ క్రికెట్లో విరాట్ కోహ్లీ 330 ఇన్నింగ్స్ల్లో 58 శతకాలు నమోదు చేశాడు. సచిన్ 60 సెంచరీల రికార్డ్కు రెండు శతకాల దూరంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ శతకంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.