టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ఆల్టైమ్ టీ20 ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ రేటింగ్ పాయింట్స్ ఐసీసీ అప్డేట్ చేసింది. 897 రేటింగ్ పాయింట్స్ నుంచి 909కి పెంచింది. దాంతో కోహ్లీ అరుదైన ఫీట్ సాధించాడు. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ 937 కాగా.. వన్డేల్లో 911 పాయింట్స్.
ఆల్ టైమ్ టీ20 ర్యాంకింగ్స్లో డేవిడ్ మలన్ 919 రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ 909 రేటింగ్ పాయింట్స్తో మూడో స్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్కు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

విరాట్ కోహ్లీ తన కెరీర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 48.69 సగటు, 137.04 స్ట్రైక్రేట్తో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 46.35 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు ఉన్నాయి. వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్న కోహ్లీ.. ఇప్పటికే 51 శతకాలతో 14000 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో శతకాలు నమోదు చేసిన అతి తక్కువ బ్యాటర్లలో కోహ్లీ ఒకడు.
విరాట్ కోహ్లీ 2017, 2018లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టీ20 ప్రపంచకప్ కూడా గెలిచాడు. డబ్ల్యూటీసీ టైటిల్ ఒక్కటే అతని కెరీర్కు లోటుగా మిగిలిపోయింది. రెండు సార్లు ఫైనల్ ఆడినా టైటిల్ దక్కలేదు.