టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్తో శనివారం జరిగిన సూపర్ మ్యాచ్లో 37 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ టోర్నీ గ్రూప్ దశలో దారుణంగా విఫలమైన కోహ్లీ.. సూపర్-8 తొలి మ్యాచ్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో దూకుడుగా ఆడుతూ విలువైన పరుగులు చేశాడు. 28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో సాయంతో 37 రన్స్తో టచ్లోకి వచ్చాడు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు 30 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 63.52 సగటుతో 1207 రన్స్ చేశాడు. వన్డే ప్రపంచకప్లో 37 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 1795 పరుగులు చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోని ప్రపంచకప్ల్లో కలిపి 3002 పరుగులు చేశాడు. మొత్తం 67 ఇన్నింగ్స్ల్లో విరాట్ 3000 పరుగుల మైలురాయి అందుకున్నాడు.
మరే బ్యాటర్ కూడా విరాట్ కోహ్లీ దరిదాపుల్లో లేరు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 69 ప్రపంచకప్ ఇన్నింగ్స్ల్లో 2637, డేవిడ్ వార్నర్ 68 ఇన్నింగ్స్ల్లో 2502, సచిన్ టెండూల్కర్ 2278(44 ఇన్నింగ్స్ల్లో), కుమార సంగక్కర 2193(65 ఇన్నింగ్స్ల్లో) ఈ జాబితాలో కోహ్లీ తర్వాత కొనసాగుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) మెరుపులు మెరిపించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్(2/32), రిషద్ హొస్సేన్(2/43) రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ తీసాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది. నజ్ముల్ హొస్సేన్ షాంటో(32 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 40), టన్జిద్ హసన్(31 బంతుల్లో 4 ఫోర్లతో 29), రిషద్ హొస్సేన్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 ) రాణించారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/19) మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యాకు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.