టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్లో అత్యధికసార్లు 50 ప్లస్ పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం సిడ్నీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. మూడో వన్డేలో మాత్రం తనదైన బ్యాటింగ్తో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డ్ను అధిగమించాడు.
వన్డేల్లో ఛేజింగ్లో ఇప్పటి వరకు 172 మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. 64.58 సగటుతో 8138 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలతో పాటు 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా కోహ్లీ ఛేజింగ్లో 70 సార్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ 69 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసి రెండో స్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ శర్మ(55), జాక్వస్ కల్లీస్(50) తర్వాతి స్థానంలో ఉన్నారు.

అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కూడా కోహ్లీ రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో అతను శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డ్ను అధిగమించాడు. ఇప్పటి వరకు 305 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 14243 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. వన్డే ఫార్మాట్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్గా ఇప్పటికే కోహ్లీ నిలిచాడు. కానీ ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ సచిన్ పేరిట ఉంది. 18426 పరుగులతో సచిన్ టాప్లో ఉన్నాడు. ఈ రికార్డ్కు దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు.
సుమారు ఐదు నెలల విరామం తర్వాత మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ..తొలి రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపర్చాడు. తన 17 ఏళ్ల వన్డే క్రికెట్లో వరుసగా డకౌటవ్వడం ఇదే తొలిసారి. తప్పక ఆడాల్సిన మూడో మ్యాచ్లో కోహ్లీ(81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) చెలరేగాడు. రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించడంతో ఈ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. టీ20, టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు.. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.