రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి ఆసియా బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 62 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయస క్యాచ్ను రియాన్ పరాగ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీకి ఇది 100వ హాఫ్ సెంచరీ. టీ20 ఫార్మాట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 108 హాఫ్ సెంచరీలతో ఉన్నాడు. విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. బాబర్ ఆజామ్ 90 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇప్పటి వరకు 404 టీ20లు ఆడిన కోహ్లీ.. 13072 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. భారత్ తరఫున 125 మ్యాచ్ల్లో 38 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీతో 4188 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 258 మ్యాచ్లు ఆడి 58 హాఫ్ సెంచరీలు 8 శతకాలతో 8252 పరుగులు చేశాడు.
కోహ్లీ సూపర్ బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో రాణించగా.. రియాన్ పరాగ్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30), ధ్రువ్ జురెల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 62 నాటౌట్), ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. దేవదత్ పడిక్కల్(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ ఒక్కడే వికెట్ తీసాడు.