హైదరాబాద్: వ్యక్తిగత జీవితంపై నిరంతర నిఘా తనను ఎంతో అసౌకర్యానికి గురిచేస్తోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమాయణం కొనసాగించిన కోహ్లీ, గతేడాది డిసెంబర్లో ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రజలు, మీడియా తాము ఎక్కడికి వెళ్లినా.. వెంట పడటం లాంటివి చేయడంతో అప్పట్లో కొంత ఇబ్బంది పడిన మాట నిజమేనని చెప్పిన కోహ్లీ, ఆ తర్వాత మెల్లగా ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నట్లు వెల్లడించాడు. 'నిరంతరం నా వ్యక్తిగత జీవితంపై అందరి దృష్టి ఉండటం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. అయితే.. ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలో నేను నేర్చుకున్నాను' అని కోహ్లీ చెప్పాడు.
'సెలెబ్రిటీలు కూడా మనుషులే. మనలాంటి వారే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని అందరూ గుర్తించుకుంటే మంచిదని నా భావన. దీనిని అవతలి వారు గుర్తుంచుకుంటే మంచిది' అని కోహ్లీ సూచించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ని కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నా. నేను కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు క్రికెట్ను పూర్తిగా పక్కనబెడతా. స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకోవడం, సినిమాలకు వెళ్లడం లేదంటే సుదూర ప్రాంతాలకు డ్రైవింగ్ చేయడం లాంటివి చేస్తా. నా కుక్కతో కొంత సమయాన్ని గడుపుతా' అని కోహ్లీ వెల్లడించాడు.
విరాట్, అనుష్క జోడీని అభిమానులు ముద్దుగా 'విరుష్క' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్లో విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్లాడి మూడింట విజయం సాధంచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.