బెంగళూరు : మూడు వన్డేల సిరీస్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డిసైడర్ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు.
మిచెల్ స్టార్క్ వేసిన 23 ఓవర్ మూడో బంతిని ఎక్స్ట్రా కవర్స్ దిశగా బౌండరీ తరలించిన కోహ్లీ.. అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్గా 5000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఫలితంగా అత్యంత వేగంగా ఈ ఘనతనందుకున్న తొలి కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. 82 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించగా.. ధోని 127 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 131 ఇన్నింగ్స్ల్లో, సౌతాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ 135 ఇన్నింగ్స్ల్లో, టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ(136 ఇన్నింగ్స్ల్లో) కెప్టెన్గా 5000 రన్స్ పూర్తి చేశారు.
ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ చెలరేగుతున్నాడు. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న అతను సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. హిట్ మ్యాన్ కూడా ఈ మ్యాచ్తో వన్డేల్లో 9000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. లబుషేన్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు.