సమకాలీన క్రికెట్లో బ్యాట్స్మెన్ అంతా ఒకవైపు.. విరాట్ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్ అనేంతా..ఒకప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ బ్యాటర్గా ప్రశంసలు అందుకున్నాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన ఈ పరుగుల యంత్రం సోమవారంతో అంతర్జాతీయ క్రికెట్లో 17 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం.
2008 అండర్-19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్లోకి తారా జువ్వలా విరాట్ కోహ్లీ దూసుకొచ్చాడు. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున అవకాశం అందుకున్న కోహ్లీ.. అదే ఏడాది శ్రీలంకతో సిరీస్కు సచిన్, సెహ్వాగ్ గాయాలతో దూరమవడంతో అనూహ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అలా ఊహ తెలిసినప్పట్నుంచీ భారత్కు ఆడాలని తండ్రితో కలిసి కోహ్లీ కన్న కల 19 ఏళ్ల వయసులో సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు(2008 ఆగస్టు 18) నెరవేరింది. కానీ ఆ మ్యాచ్లో కోహ్లీ విఫలమయ్యాడు. గంభీర్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన విరాట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాకపోతే ఆ సిరీస్లో నాలుగో మ్యాచ్లో కోహ్లీ అర్ధ శతకంతోనే టోర్నీ భారత్ సొంతమైంది. అక్కడితో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లీ ఆశ అంత సులువుగా తీరలేదు. తరవాతి సిరీస్కు సచిన్, సెహ్వాగ్ అందుబాటులోకి రావడంతో కోహ్లీ జట్టులో చోటు కోల్పోయాడు.
2009లో భారత్లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ సింగ్ దూరమయ్యాడు. అతని స్థానంలో కోహ్లీకి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్తో కలిసి సింగిల్స్ తీస్తూ అతను తన తొలి శతకాన్ని సాధించాడు. మూడో వికెట్కు వీరిద్దరూ 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే కోహ్లీ ఆటకు ముగ్దుడైన గంభీర్ తనకు ఇచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకి ఇచ్చేసాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు. అనతి కాలంలోనే స్టార్ క్రికెటర్గా టీమిండియా కెప్టెన్గా ఎదిగాడు. అతని సారథ్యంలో భారత జట్టు అద్భుత విజయాలు అందుకున్నా.. ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోని భారత్ ఓటమిపాలైంది. అదే సమయంలో కోహ్లీ ఫామ్ కోల్పోయాడు. దాంతో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
రోహిత్ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగిన కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. అనూహ్యంగా టెస్ట్లకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడి ఆటకు అల్విదా ప్రకటించాలనుకుంటున్నాడు. 18 ఏళ్ల ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు కూడా ఈ ఏడాదే తెరబడింది. విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకుంది.