ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలవరీలను ఆడటంలో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ.. మరోసారి అదే తప్పిదంతో వికెట్ పారేసుకున్నాడు. సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఆఖరి టెస్ట్లో ఓపికగా ఆడిన విరాట్ కోహ్లీ(69 బంతుల్లో 17 ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి వికెట్ పారేసుకున్నాడు.
స్కాట్ బోలాండ్ వేసిన 32వ ఓవర్లో వెబ్స్టర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్ మొత్తం కోహ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే ఔటవ్వడం గమనార్హం. ఈ ఐదు టెస్ట్ల సిరీస్లో 2-1తో వెనుకంజలో ఉన్న టీమిండియాకు తాజా మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఈ సిరీస్ సమం కావడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ క్రమంలోనే వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపిస్తున్నాడు.

కోహ్లీ కూడా తన శైలిని మార్చుకొని ఓపికగా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లీ.. ఆ తర్వాత అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో డిఫెన్స్కు పరిమితమయ్యాడు. అయితే మ్యాచ్ సాగుతున్నా కొద్దీ సహనం కోల్పోయిన కోహ్లీ.. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ సిరీస్లో కోహ్లీ ఆడిన 8 ఇన్నింగ్స్ల్లో ఏడు సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ డెలివరీలకే వెనుదిరిగాడు.
పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ అజేయ శతకంతో మెరిసిన కోహ్లీ.. ఆ తర్వాత ఒక్క ఇన్నింగ్స్లోనూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. దాంతో కోహ్లీ కెరీర్ ముగింపు దశకు చేరిందని, రిటైర్మెంట్ ప్రకటించడం ముఖ్యమని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఈ సిరీస్తోనే కోహ్లీ కెరీర్కు ఎండ్ కార్డ్ వేయాలని హితవు పలుకుతున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ సెషన్లోనే యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4), శుభ్మన్ గిల్(20) వికెట్లు కోల్పోయిన భారత్.. రెండో సెషన్లో విరాట్ కోహ్లీ(17) ఔటవ్వడంతో 4 వికెట్లకు 72 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి పంత్ ఆచితూచి ఆడుతున్నాడు.