
చెత్త ప్రదర్శన..
పింక్బాల్ టెస్టులో టీమిండియా ఆటగాళ్ల చెత్త ప్రదర్శన ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో స్పష్టంగా కనిపించింది. ఒకవేళ కెప్టెన్ కోహ్లీ ఆసీస్తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ చేసి ఉంటే తొలిస్థానాన్ని అందుకునేవాడు. కానీ మొదటి ఇన్నింగ్స్లో 74 పరుగులు చేయడం.. రెండో ఇన్నింగ్స్లో 4పరుగులకే వెనుదిరగడంతో రెండు పాయింట్లు సాధించి 888 పాయింట్లతో 2వ స్థానంలోనే ఉన్నాడు.

పుజారా ర్యాంకు..
ఇక ఆసీస్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోకపోయినా మొదటిస్థానాన్ని నిలుపుకున్నాడు. విరాట్కు అతనికి కేవలం మూడు పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఆసీస్తో టెస్టుకు ముందు 7వ స్థానంలో ఉన్న పుజారా ఒకస్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. ఇక వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కేన్ విలియమ్సన్ మూడో స్థానానికి చేరుకోగా.. కోహ్లీ, విలియమ్సన్ల మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.

టాప్-5లో హేజల్వుడ్
ఇక బౌలింగ్ విభాగంలో పింక్బాల్ టెస్టులో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న హేజల్వుడ్ ఏకంగా 5వ స్థానానికి చేరుకోగా.. మరో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 910 పాయింట్లో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్ బౌలర్లలో అశ్విన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 9వ స్థానంలో నిలిచాడు. పింక్బాల్ టెస్టుకు ముందు 8వ స్థానంలో ఉన్న బుమ్రా రెండు స్థానాలు దిగజారి హోల్డర్తో కలిసి సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు.

ఫ్లాఫ్ 36..
రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్లో వెనుకంజ వేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్ హెజల్వుడ్ (5/8), ప్యాట్ కమిన్స్ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది.


Click it and Unblock the Notifications
