
ముంబై: రోహిత్ శర్మను టీమిండియా వన్డే కెప్టెన్గా చేసిన విధానంలో బీసీసీఐ తీరు సరిగా లేదని విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ అన్నాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు ఉన్నాడని, బీసీసీఐ ప్రకటన వచ్చిన రోజు నుంచి అతని ఫోన్ స్విచ్చాఫ్లో ఉందని పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లీతో నేను ఇప్పటిదాకా మాట్లడలేదు. కారణం తెలియదు. కానీ అతని ఫోన్ ఆఫ్లో ఉంది. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీని మాత్రమే వదులుకున్నాడు. వన్డే కెప్టెన్సీ కూడా వదులు కోవాలనో లేదంటే, కెప్టెన్గా కొనసాగమనో సెలెక్టర్లు అప్పుడే కోహ్లీని అడిగి ఉండవచ్చు.
మరోపక్క, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని కోహ్లీని ప్రపంచకప్ అప్పుడే రిక్వెస్ట్ చేశామని సౌరవ్ గంగూలీ ఇటీవల చెప్పాడు. అలాంటి విషయం ఒకటి జరిగిందని నేనైతే ఎక్కడా వినలేదు. అందువల్ల గంగూలీ ప్రకటన నన్ను అశ్చర్యపరిచింది. జరిగిందంతా చూస్తే చాలా వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే వన్డేల్లో విరాట్ చాలా సక్సెస్ఫుల్ కెప్టెన్. అలాంటి వ్యక్తిపై ఎందుకు వేటు వేశారో సెలెక్టర్లు నుంచి సరైన ప్రకటన కూడా లేదు. టీమ్మేనేజ్మెంట్, బోర్డు, సెలెక్టర్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎందులోనూ క్లారిటీ లేదు. పారదర్శకత కనిపించడం లేదు.'అని రాజ్కుమార్ పేర్కొన్నాడు.
టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించడాన్ని భారత మాజీ క్రికెటర్ మదన్లాల్ తప్పుబట్టాడు. వైట్ బాల్ క్రికెట్లో ఇద్దరు కెప్టెన్లు ఉంటే ఏమవుతుందని ప్రశ్నించాడు. ఓ బలమైన జట్టును నిర్మించాలంటే కష్టం కానీ.. నాశనం చేయడం ఎంతసేపని అసహనం వ్యక్తం చేశాడు. 'అసలు సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. విరాట్ కోహ్లీ భారత జట్టుకు విజయాలందిస్తున్నప్పుడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాల్సిన అవసరం ఏం ఉంది.? టీ20 సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ ఎందుకు తప్పుకున్నాడో అర్థం చేసుకోగలను.
వన్డే, టెస్ట్ ఫార్మాట్లపై మరింత ఫోకస్ పెట్టేందుకే కోహ్లీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు విరాట్ కోహ్లీనే కెప్టెన్గా ఉంటాడనుకున్నా. విజయాలందిస్తున్నా వేటు వేసారంటే.. అది పనిగట్టుకొని చేసిన పనేనని అర్థం చేసుకోవచ్చు. ఓ బలమైన జట్టును నిర్మించాలంటే చాలా కష్టం. కానీ నాశనం చేయడం చాలా సులువు.'అని మదన్లాల్ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు.