రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తీవ్రంగా తడబడ్డాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో స్వేచ్ఛగా.. దూకుడుగా ఆడిన కోహ్లీ.. ఆ జోరును తాజా మ్యాచ్లో కొనసాగించలేకపోయాడు. పిచ్ కొంచెం స్లోగా ఉండటంతో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
మరో ఎండ్లో ఇతర ఆటగాళ్లు అలవోకగా బౌండరీలు బాదినా.. కోహ్లీ మాత్రం క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్నాడు. ఈ క్రమంలో చాలా బంతులను వృథా చేశాడు. బంతి కాస్త ఆగి రావడంతో కోహ్లీ స్వేచ్చగా ఆడలేకపోయాడు. 30 బంతుల్లో 31 పరుగులే చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉండటం గమనార్హం. అవి కూడా తన ఔటయ్యే ముందే కొట్టాడు. సీఎస్కే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ స్లో బ్యాటింగ్ కారణంగా.. ఇతర బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనతో అనవసర షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నారు.

ఆరెంజ్ క్యాప్ కోసం కాదు..
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నెటిజన్లు కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీ 5 ఓవర్ల ఆడి 31 పరుగులు చేస్తే.. మిగతా 15 ఓవర్లలో ఆర్సీబీ 165 పరుగులు చేసిందని ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ కారణంగా ఆర్సీబీ 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ జిడ్డు బ్యాటింగ్ కంటే డకౌట్ అవ్వడం ఉత్తమమని కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా.. ఐపీఎల్ ట్రోఫీ కోసం ఆడాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రజత్ పటీదార్, టీమ్ డేవిడ్ ఆడకపోయి ఉంటే.. ఈ మ్యాచ్లో ఆర్సీబీ దారుణంగా విఫలమయ్యేదని కామెంట్ చేస్తున్నారు. 'కోహ్లీ.. నీ జిడ్డు బ్యాటింగ్కు ఓ దండం సామీ’ అని మండిపడుతున్నారు.
చెలరేగిన రజత్ పటీదార్, టీమ్ డేవిడ్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫిల్ సాల్ట్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 32), విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో టీమ్ డేవిడ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్(3/36) మూడు వికెట్లు తీయగా.. మతీష పతీరణ(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు. చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ఫీల్డింగ్ ఆర్సీబీకి కలిసొచ్చింది. రజత్ పటీదార్ ఇచ్చిన మూడు క్యాచ్లను చెన్నై ఆటగాళ్లు నేలపాలు చేశారు. సామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్లో టీమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్ను తమవైపు మలుపు తిప్పాడు.