టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్గా నిలిచాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్కు ముందు ఈ మైలురాయికి 25 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ.. న్యూజిలాండ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ బౌలింగ్లో బౌండరీ బాది ఈ ఘనతను అందుకున్నాడు. 624 ఇన్నింగ్స్ల్లోనే కోహ్లీ ఈ మైలురాయి అందుకొని అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అతను సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కరల ఆల్టైమ్ రికార్డ్ను బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించగా.. కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ 28వేల పరుగుల్లో కోహ్లీ 296 వన్డేల్లో 53 శతకాలు, 76 హాఫ్ సెంచరీలతో 14557* పరుగులు చేశాడు. 210 టెస్ట్ల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 9230 పరుగులు నమోదు చేశాడు. 117 టీ20ల్లో ఒక సెంచరీ 38 హాఫ్ సెంచరీలతో 4188 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు.
ఈ క్రమంలో సంగక్కరను కోహ్లీ అధిగమించాడు. సంగక్కర 666 ఇన్నింగ్స్ల్లో 63 శతకాలు, 153 హాఫ్ సెంచరీలతో 28016 పరుగులు చేయగా.. సచిన్ టెండూల్కర్ 100 శతకాలు, 164 హాఫ్ సెంచరీలతో 34,357 పరుగులతో టాప్లో కొనసాగుతున్నాడు.
సచిన్ అత్యధిక పరుగుల రికార్డ్ను బ్రేక్ చేసే అవకాశం విరాట్ కోహ్లీకి లేదు. కానీ వన్డే ప్రపంచకప్ 2027 వరకు అతను ఫామ్లో కొనసాగితే 100 సెంచరీల రికార్డ్ను అధిగమించవచ్చు. ఈ రికార్డ్ సాధించేందుకు కోహ్లీకి ఇంకా 17 శతకాలు కావాలి. కానీ అతనికి 30 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం ఉంది.
అది కూడా వన్డే ప్రపంచకప్ 2027లో భారత్ ఫైనల్ చేరితేనే 30 వన్డే మ్యాచ్లు ఆడగలడు. న్యూజిలాండ్తో సిరీస్ అనంతరం మరో 6 నెలల వరకు భారత్ వన్డేలు ఆడదు. ఇప్పటికే కోహ్లీ అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.