టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి ముందే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ఎక్స్(ట్విటర్) వేదికగా అత్యధిక ఫోలోవర్లు కలిగిన రెండో స్పోర్ట్స్ అథ్లెట్గా నిలిచాడు. ఈ క్రమంలో ఫుట్బాల్ స్టార్ నేయ్మార్ జూనియర్ను విరాట్ కోహ్లీ అధిగమించాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ఎక్స్ వేదికగా 63.5 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. నేయ్మర్ జూనియర్ను 63.4 మిలియన్ల యూజర్లు ఫాలో అవుతున్నారు. ఇద్దరి ఫాలోవర్ల విషయంలో హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ 269 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. నేయ్మర్ను 221 మిలియన్ల యూజర్సే అనుసరిస్తున్నారు.

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన స్పోర్ట్స్ అథ్లెట్గా క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇన్స్టాగ్రామ్లో రోనాల్డోను 630 మిలియన్ల యూజర్లు, ఎక్స్వేదికగా 111 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం కుటుంబంతో గడిపిన విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ 2024తో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు.
ఐర్లాండ్తో మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాకు ఆలస్యంగా వచ్చిన కోహ్లీ.. బంగ్లాదేశ్తో వామప్ మ్యాచ్ ఆడలేదు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే కోహ్లీ ప్రపంచకప్ బరిలోకి దిగుతున్నాడు. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా ఐర్లాండ్తో తొలి మ్యాచ్ నేడు(బుధవారం) ఆడనుండగా.. పాకిస్థాన్తో ఆదివారం, అమెరికాతో జూన్ 12, కెనడాతో జూన్ 15న తదుపరి మ్యాచ్ల్లో తలపడనుంది.
లీగ్ స్టేజీల్లో నాలుగు గ్రూప్ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధించనున్నాయి. సూపర్-8లో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో తలపడున్నాయి. జూన్ 29న వెస్టిండీస్లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.