టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు. వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు గెలుచుకున్న కింగ్ కోహ్లీ.. ఈ ఘనతను అత్యధికంగా నాలుగు సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా చరిత్రకెక్కాడు.
గతేడాది వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చడంతోనే ఈ అవార్డుకు ఎంపిక చేసామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తెలిపింది. గతంలో కింగ్ కోహ్లీ 2012, 2017, 2018లో వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.

తాజా అవార్డుతో కలిపి కోహ్లీ ఖాతాలో ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. ఈ క్రమంలో 10 ఐసీసీ అవార్డులు అందుకున్న తొలి ప్లేయర్గా కూడా కోహ్లీ చరిత్రకెక్కాడు. అత్యధిక ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితాలో కోహ్లీకి సమీపంగా మరే ఆటగాడు లేకపోవడం గమనార్హం. కోహ్లీ తర్వాత శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర(4 అవార్డులు), భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(4 అవార్డులు) ఉన్నారు.
బీసీసీఐ అవార్డుల్లో ఇప్పటి వరకు ఐదు గెలుచుకున్న విరాట్ కోహ్లీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్స్ను మూడు సార్లు సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ను 12 సార్లు అందుకున్నాడు.
గతేడాది వన్డేల్లో 24 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 72.47 సగటుతో 1377 రన్స్ చేశాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో కోహ్లీ 765 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ప్రపంచకప్లో మూడు శతకాలు, 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ టోర్నీలోనే వన్డేల్లో 50 శతకాల మార్క్ అందుకున్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. అతని సారథ్యంలో ఆస్ట్రేలియా గతేడాది డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్తో పాటు వన్డే ప్రపంచకప్ గెలిచింది. ఉస్మాన్ ఖవాజా టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.