Virat Kohli: రహానే ఫామ్ జడ్జ్ చేయలేను.. బయటి మాటలు పట్టించుకోం!

ముంబై: పేలవ ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానేకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. రహానే ఫామ్ను జడ్జ్ చేయలేనని, తానే కాదూ ఎవరూ అని చేయలేరని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అజింక్య రహానే దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో తొలి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రహానే.. ఆ మ్యాచ్లో మొత్తంగా 39(35, 4) పరుగులు మాత్రమే చేసి విమర్శల పాలయ్యాడు. ఈ క్రమంలో రెండో టెస్టుకు కోహ్లీ అందుబాటులోకి రావడం.. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో తొలి టెస్టులో తన మార్కు చూపించడం తదితర పరిణామాల నేపథ్యంలో రహానే జట్టులో స్థానం కోల్పోయాడు.

రహానే ఫామ్ గురించి జడ్జ్ చేయలేను..
ఇక ముంబై వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన కోహ్లీసేన సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ రహానే ఫామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'రహానే ఫామ్ గురించి జడ్జ్ చేయలేను. నేనే కాదు ఎవరూ ఆ పని చేయలేరు. తమ లోపాలేమిటి? వాటిని ఎలా అధిగమించాలన్న అంశంపై సదరు ఆటగాడు దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే, కీలక మ్యాచ్ల్లో తమదైన అద్భుత ప్రదర్శనతో ప్రభావం చూపగలరో అలాంటి ఆటగాళ్లకు కష్టకాలంలో మద్దతుగా నిలవాల్సి ఉంటుంది'అని అజింక్యా రహానేకు అండగా నిలిచాడు.

బయటి విషయాలు మాకు అనవసరం..
'ఒక వ్యక్తిపై ఒత్తిడి ఉన్నపుడు... పదే పదే అతని ఫామ్ గురించి మాట్లాడుతూ గుచ్చిగుచ్చి మాట్లాడేవాళ్లను ఒక జట్టుగా మేము అస్సలు సహించబోము. బయట కొంతమంది తమకు ఇష్టమైన ఆటగాళ్లకు ఇప్పుడు మద్దతు పలికి.. ఆ తర్వాత వాళ్లను కూడా జట్టులో తీసేయాలంటూ మాట్లాడతారు. అలాంటి వాళ్ల విమర్శలపై మేము అస్సలు స్పందించం. ఆటను ఆటలాగే చూస్తాం. అజింక్య రహానే.. లేదంటే ఇంకో ఆటగాడు.. ఎవరికైనా సరే మా మద్దతు ఇలాగే ఉంటుంది. బయట ఉన్న పరిస్థితుల ప్రభావం ఆధారంగా జట్టులో ఓ సభ్యుడిని కొనసాగించాలా.. పక్కకు పెట్టాలా అనేదానిపై నిర్ణయం తీసుకోము'అని విమర్శకులకు కోహ్లీ చురకలంటించాడు.

మయాంక్, అశ్విన్..
ముంబై వేదికగా జరిగిన ఈ రెండో టెస్ట్లో 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 60), హెన్రీ నికోల్స్(111 బంతుల్లో 8 ఫోర్లు 44), విల్ యంగ్ (41 బంతుల్లో 4 ఫోర్లతో 20), రచిన్ రవీంద్ర(50 బంతుల్లో 4 ఫోర్లతో 18) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా.. కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. రవిచంద్రన్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications