హైదరాబాద్: సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ను టీమిండియా 1-0 కైవసం చేసుకుంది. ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్లో సమష్టిగా రాణించి 372 పరుగుల భారీ తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ఈ విజయంతో సొంతగడ్డపై టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. 2012 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు సొంతగడ్డపై ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. వరుసగా 14 సిరీస్లకు 14 గెలుచుకుంది.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మొదలైన ఈ జైత్రయాత్రను కోహ్లీసేన కూడా కొనసాగిస్తుంది. 2014లో విరాట్ సారథ్య బాధ్యతలు అందుకోగా.. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా ఓ గొప్ప జట్టుగా ఎదిగింది. 6 ఏళ్ల క్రితం టెస్ట్ల్లో 7వ స్థానంలో ఉన్న టీమిండియా.. 2015 సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ తర్వాత అగ్రస్థానానికి చేరింది. ఇప్పటికే అదే ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది.
#ViratKohli కెప్టెన్సీ.. సూపరో సూపర్!#INDvsNZ #MumbaiTest pic.twitter.com/WKrZefGIZa
— uppala shivaprasad (@shivauppala93) December 6, 2021
దాంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ కెప్టెన్ విరాట్ కోహ్లీనేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక సొంతగడ్డపై భారత్ చివరిసారిగా 2012లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ధోనీ సారథ్యంలో భారత జట్టు చెత్తాటతో సిరీస్ను చేజార్చుకుంది.
ముంబై టెస్ట్ విషయానికి వస్తే.. 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 60), హెన్రీ నికోల్స్(111 బంతుల్లో 8 ఫోర్లు 44), విల్ యంగ్ (41 బంతుల్లో 4 ఫోర్లతో 20), రచిన్ రవీంద్ర(50 బంతుల్లో 4 ఫోర్లతో 18) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా.. కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. రవిచంద్రన్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది.