ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమైంది. తొలి టెస్ట్ విజయంతో ఘనంగా ఈ సిరీస్ ప్రారంభించిన టీమిండియా.. ఆ తర్వాత మూడు మ్యాచ్ల్లోనూ తేలిపోయింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు దారుణంగా విఫలమయ్యారు.
ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు.

మరోవైపు విరాట్ కోహ్లీ పెర్త్ టెస్ట్ సెంచరీ మినహా మిగతా మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ప్రతీ ఇన్నింగ్స్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను వెంటాడి పెవిలియన్ చేరాడు. ఈ సమస్యను కోహ్లీ అధిగమించలేకపోతున్నాడు. దాంతో ఈ ఇద్దర్నీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రంజీ క్రికెట్ ఆడి ఫామ్ సాధించాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ జనవరి 7న ముగియనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే మాత్రం టీమిండియా ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. క్రికెట్ అభిమానులందరి ఫోకస్ ఈ టోర్నీపైనే ఉండనుంది. ఈ టోర్నీలోనే కోహ్లీ, రోహిత్ ఆడనున్నాడు. ఈ మెగా టోర్నీకి ముందు భారత్ సొంతగడ్డపై ఇంగ్లండ్తో మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కోహ్లీ, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో వారు ఫిబ్రవరి 6న జరిగే వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ను భారత్ వామప్గా భావిస్తోంది. అయితే ఈ సిరీస్ నుంచి కూడా రోహిత్, కోహ్లీలకు విశ్రాంతి కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ ముందు జరిగే వన్డే సిరీస్కు విశ్రాంతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోహ్లీ, రోహిత్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విశ్రాంతి అవసరమా? అని మండిపడుతున్నారు. అసలేం చేశారని వారికి విశ్రాంతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్తో జరిగే సిరీస్ల నుంచి జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతికి కల్పించినట్లు తెలుస్తోంది.