
విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. మరోరసవత్తర పోరుకు సిద్దమైంది. తెలుగు గడ్డపై సిరీస్ను ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం (Vizag ODI) వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలయ్యే రెండో వన్డేలో ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. బామ్మర్థి పెళ్లితో తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్శర్మ.. ఈ మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు. రెండో వన్డేలో విజయంతో లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు అంత తేలిక కాకపోవచ్చు.
అయితే ఈ మ్యాచ్కు వర్షం గండం పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. శుక్ర, శనివారాల్లో ఎక్కువ సమయం ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఉదయం, సాయంత్రం జల్లులు కూడా పడ్డాయి. దాంతో మైదానాన్ని గ్రౌండ్స్మెన్ పూర్తిగా కవర్లతో కప్పేశారు. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో కూడా వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ పూర్తి ఓవర్లు సాగడం కష్టమే. కాస్త సంధిస్తే మాత్రం ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించనున్నారు.

ఇక వైజాగ్ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. మైదానంలోని చిన్న బౌండరీలు కూడా బ్యాటర్లకు కలిసొస్తాయి. స్పిన్నర్లు ఇక్కడ బాగానే ప్రభావం చూపుతారు. ఈ వికెట్పై టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ మూడు మ్యాచ్లు ఆడిన అతను 9 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు కూడా మెరుగైన గణంకాలున్నాయి. ఇప్పటి వరకు విశాఖలో ఆడిన ఆరు వన్డేల్లో కోహ్లీ 556 పరుగులు చేశాడు. యావరేజ్ 111.20 ఉండగా.. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ విశాఖలో ఆడిన ఆరు వన్డేల్లో 68.40 సగటుతో 342 పరుగులు సాధించాడు. వైజాగ్ తన అమ్మమ్మగారి ఊరు అనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విశాఖలో 10 వన్డేలు జరగ్గా.. భారత్ ఏడింట్లో నెగ్గి.. ఒకదాంట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దవగా.. మరొకటి టై అయింది. విశాఖలో ఆసీస్తో ఆడిన ఏకైక వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.