చిచ్చు పెట్టిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఎవరు గ్రేట్ ప్లేయర్ అన్న విషయంలో అభిమానుల మధ్య కూడా ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ట్విటర్లో ఈ ఇద్దరు ప్లేయర్స్ అభిమానులు గొడవకు దిగారు. అయితే ఈసారి ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ నిప్పు రాజేసింది. 'రోహిత్, కోహ్లీ అభిమానులు ఒకరినొకరు ఎందుకంతలా ద్వేషిస్తారు?.. ఆ ఇద్దరూ ఇండియన్ ప్లేయర్సే కదా. నాకు సమాధానం కావాలి' అంటూ క్లోయీ అమందా బెయిలీ అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా.. యే గునా హై (ఇది నేరం) అంటూ నసీరుద్దీన్ షా డైలాగ్ను కూడా పోస్ట్ చేశారు.

గొడవపడిన ఫాన్స్
ఆస్ట్రేలియా జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ట్వీట్ చూసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు.. మళ్లీ యుద్ధం మొదలుపెట్టారు. 'రోహిత్ అంటే కోహ్లీకి ద్వేషం అని', 'రోహిత్ను కోహ్లీ చాలా సార్లు మెచ్చుకున్నాడు కానీ.. రోహిత్ ఎప్పుడూ కోహ్లీని మెచ్చుకోలేదని', 'కోహ్లీ ఖాతాలో ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదని అందుకే అతన్ని చూసి రోహిత్ నవ్వుకుంటాడు' అని ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు ట్విట్టర్ వేదికగానే మాటల యుద్ధం చేశారు. ఒకరినొకరు సోషల్ మీడియాలోనే కొట్టుకునేంత పనిచేశారు. ప్రస్తుతం ఇద్దరి ఆటగాళ్ల ఫాన్స్ పోస్ట్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

రోహిత్ ఇన్..కోహ్లీ ఔట్
ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ అనంతరం పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి రానున్నాడు. ఐపీఎల్ అనంతరం స్వదేశానికి వచ్చిన రోహిత్ శర్మపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. అయితే ఎన్సీఏ నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో పాసైన రోహిత్.. ఆసీస్తో జరిగే చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండనున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్.. 14 రోజులు క్వారంటైన్లో ఉండనున్నాడు. ఇక కోహ్లీ స్థానంలో మిగిలిన టెస్టులకు అజింక్యా రహానే నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్ అనంతరం కోహ్లీ-రోహిత్ కలిసిన ఆడిన దాఖలు లేవు.

వన్డే ప్రపంచకప్ సమయంలో తెరపైకి వివాదం
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ముందు వరకు కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య విభేదాల ప్రస్తావన తెరమీదకు రాలేదు. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో.. కోహ్లీ, రోహిత్ మధ్య స్నేహం సవ్యంగా లేదనే సంగతి బయటపడింది. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. జట్టులో మిగతావాళ్ల అభిప్రాయాలకు విలువేలేదని రోహిత్ ఆగ్రహించాడని తెలిసింది. ఆటగాళ్ల ఎంపికలోనూ రోహిత్ మాట వినిపించుకోలేదని సమాచారం. జట్టు అవసరాల మేరకు కాకుండా తన శిబిరం వారినే కోహ్లీ తుది జట్టులోకి తీసుకోవడం హిట్మ్యాన్కు నచ్చలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో అతడు కోహ్లీ, అనుష్కను ఇన్స్టాలో అన్ఫాలో అయ్యాడని తెలియడంతో రచ్చ మొదలైంది.

అనుష్క ఓ చివరన కూర్చొంటే.. రితిక మరో చివరన
ప్రపంచకప్ ముగిసిన తర్వాత రోహిత్-కోహ్లీపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగింది. ఈ వివాదంలోకి కుటుంబ సభ్యులనూ లాగారు. అప్పటికి కోహ్లీ, అనుష్క ఇన్స్టా ఖాతాలను రోహిత్ అన్ఫాలో చేశాడు. కోహ్లీ మాత్రం రోహిత్, రితికాను ఫాలో అవుతున్నాడు. అనుష్క మాత్రం ఇద్దరినీ ఫాలో అవ్వడం లేదు. రితిక సైతం విరుష్కను అన్ఫాలో చేసింది. ఇక మ్యాచులు ఆడేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే.. రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని కోహ్లీ స్పష్టం చేశాడు. తమ మధ్య వివాదం లేదని పేర్కొన్నాడు.

రోహిత్ను ఎంపిక చేయకపోవడంతో
ఆ తర్వాతి పర్యటనలో కోహ్లీ, రోహిత్ కలిసి ఆడుతూ.. నవ్వుతూ కనిపించడంతో వివాదం మరుగునపడింది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ను ఎంపిక చేయకపోవడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. కావాలనే రోహిత్ను కోహ్లీ పక్కనపెట్టాడని వార్తలు వచ్చాయి. రోహిత్ గాయం పరిస్థితిపై పూర్తి సమాచారం లేదని, అంతా గందరగోళం నెలకొందని కోహ్లీ అనడంతో విషయం మరింత రంజుగా మారింది. మొత్తానికి ఫాన్స్ కొట్టుకునే వరకు వచ్చింది. మరి రోహిత్-కోహ్లీ మధ్య వివాదం ఎలా ముగిసిపోతుందో చూడాలి.
స్టార్క్ బౌన్సర్.. కోహ్లీకి గాయం!! రక్తం కారినా బ్యాటింగ్ చేసిన విరాట్!


Click it and Unblock the Notifications












