
అడిలైడ్: నాలుగు టెస్ట్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ (డే/నైట్) తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (74: 180 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ వేసిన 61వ ఓవర్ మొదటి బంతికి సింగల్ తీసిన కోహ్లీ.. అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. అయితే కోహ్లీ హాఫ్ సెంచరీ చేయకముందే గాయానికి గురయ్యాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 43వ ఓవర్లో కోహ్లీ బొటనవెలికి గాయమైంది.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే మిచెల్ స్టార్క్ ఓపెనర్ పృథ్వీ షా వికెట్ తీసి మంచి ఊపుమీదున్నాడు. స్టార్క్ దెబ్బకు భారత బ్యాట్స్మెన్ రక్షణాత్మక విధానమే అనుసరించారు. మయాంక్ అగర్వాల్ ఔట్ అనంతరం విరాట్ కోహ్లీ వచ్చాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఆసీస్ స్పిన్, పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. అయితే 43వ ఓవర్లో స్టార్క్ బౌన్సర్ సాధించగా.. విరాట్ డిఫెన్స్ ఆడాడు. బంతి కాస్తా కోహ్లీ కుడిచేయి బొటనవెలికి బలంగా తాకింది.
వెంటనే విరాట్ కోహ్లీ గ్లోవ్ తీసేసి విలవిల్లాడు. బొటనవేలుకు రక్తస్రావం అయింది. టీమిండియా ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స చేశాడు. అనంతరం కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఆపై హాఫ్ సెంచరీ చేశాడు. అయితే అదృష్టవశాత్తూ కోహ్లీకి అయిన గాయం చిన్నదే అని తెలుస్తోంది. గాయం అయినా కోహ్లీ బ్యాటింగ్ చేయడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే కోహ్లీ అనూహ్యరీతిలో రనౌటయ్యాడు. అజింక్య రహానేతో సమన్వయ లోపం కారణంగా రనౌటయ్యాడు. భారత్ తొలిరోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.
అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టెస్టుల్లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచాక.. టీమిండియా మ్యాచ్ ఓడిపోయిన దాఖలాలు లేవు. దీంతో ఆ సెంటిమెంట్ ఈ డే/నైట్ టెస్టులోనూ పునరావృతం అవ్వాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. టెస్టుల్లో మొత్తం 21 సందర్భాల్లో టాస్ గెలిచిన కోహ్లీ అన్ని మ్యాచ్లు గెలిచాడు. అలాగే విదేశాల్లోనూ ఈ విధంగా మంచి రికార్డు కొనసాగిస్తున్నాడు. విదేశాల్లో 10సార్లు టాస్ గెలవగా.. 8 సార్లు భారత జట్టు విజయం సాధించింది. దీంతో టెస్టుల్లో కోహ్లీ టాస్ గెలిస్తే.. దాదాపు మ్యాచ్ గెలిచినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.