లక్నో: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ మరోసారి గొడవపడ్డారు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో లక్నోపై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో గంభీర్-కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీసారు. అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా.. కేఎల్ రాహుల్ గంభీర్ను పక్కకు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ చాలా దూకుడుగా కనిపించాడు. లక్నో బ్యాటింగ్ చేస్తున్నంత సేపు.. కోహ్లీ చాలా ఆగ్రహంగా సంబరాలు జరుపుకున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో గౌతమ్ గంభీర్ చేసిన అతికి విరాట్ కోహ్లీ తాజా మ్యాచ్లో బదులిచ్చే ప్రయత్నం చేశాడు. బెంగళూరు వేదికగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠ సాగిన తొలి మ్యాచ్లో లక్నో ఒక్క పరుగుతో గెలవడంతో గౌతమ్ గంభీర్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు.
ఆర్సీబీ అభిమానులవైపు చూస్తూ... ష్.. గమ్మునుండాలని సైగ చేశాడు. విజయం మాదని గర్వం ప్రదర్శించాడు. అప్పట్లో ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇది మనుసులో పెట్టుకున్న విరాట్ కోహ్లీ.. ఆయూష్ బదోని క్యాచ్ అందుకోగానే గంభీర్లానే ష్.. గప్చుప్గా ఉండాలని ప్రేక్షకులకు సూచించాడు.
వికెట్ కోల్పోయినప్పుడల్లా ఇదే తరహాలో సంబరాలు చేసుకున్నాడు. విజయానంతరం గట్టిగా అరిచాడు. కోహ్లీ చర్యలతో ఆగ్రహానికి గురైన గంభీర్.. ఏదో అనగా విరాట్ ధీటుగా బదులిచ్చాడు. దాంతో గొడవకు దారి తీసింది. విరాట్ కోహ్లీని శాంతపరిచేందుకు కేఎల్ రాహుల్ చాలా ప్రయత్నించాడు. పక్కకు తీసుకెళ్లి చాలాసేపు మాట్లాడాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అనంతరం కూడా ఈ ఇద్దరూ ఆటగాళ్లు గొడవపడ్డారు. కోహ్లీతో మాట్లాడుతున్న కైల్ మేయర్స్ను గంభీర్ పక్కకు తీసుకెళ్లగా.. విరాట్ మండిపడ్డాడు. 2013లో కేకేఆర్ కెప్టెన్గా ఉన్న గంభీర్తో కోహ్లీకి తొలిసారి గొడవ జరగ్గా.. అప్పటి నుంచి ఈ ఫైట్ కొనసాగుతూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా కోహ్లీని గంభీర్ విమర్శిస్తూనే ఉన్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులే చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో ఫోర్, సిక్స్తో 44), కెప్టెన్ విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 3 ఫోర్లతో 31) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్
మూడు వికెట్లు తీయగా.. రవిబిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. కృష్ణప్ప గౌతమ్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.5 ఓవర్లలో 108 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. కృష్ణప్ప గౌతమ్(23), అమిత్ మిశ్రా(19) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్, మ్యాక్స్వెల్, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.