చాహల్ మాయ..
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాడు మహిపాల్ లోమ్రోర్(39 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 47)రాణించగా.. చివర్లో ఆర్చర్(16 నాటౌట్), రాహుల్ తెవాటియా(24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/24) మూడు వికెట్లతో చెలరేగగా.. ఇసురు ఉడానా(2/41) రెండు వికెట్లు తీసాడు. సైనీకి ఒక వికెట్ దక్కింది.
టచ్లోకి కోహ్లీ..
అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 158 పరుగులు చేసి 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ దేవ్దూత్ పడిక్కల్(45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 63) తన ఫామ్ను కొనసాగించాడు. ఈ సీజన్లో పడిక్కల్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు.
ఆదిలోనే షాక్..
155 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్(8)ను శ్రేయస్ గోపాల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో మరో ఓపెనర్ పడిక్కల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. రెండో వికెట్కు ఈ ఇద్దరు 99 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
ఏబీడితో కలిసి..
ఆర్సీబీ విజయం ముంగిట ఆర్చర్ బౌలింగ్లో పడిక్కల్ క్లీన్ బౌల్డ్ కాగా.. క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలయర్స్(12 నాటౌట్)తో విరాట్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అద్భుత బౌలింగ్తో విజయంలో కీలక పాత్ర పోషించిన యుజ్వేంద్ర చాహల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.