
డే/నైట్ బంతి మారింది..
భారత జట్టు బంగ్లాతో తమ పింక్ బాల్ టెస్టును ‘ఎస్జీ'బంతితో ఆడింది. కానీ ఆస్ట్రేలియాతో సిరీస్లో ‘కూకాబుర్రా' బంతిని వాడనున్నారు. అయితే గత ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు కూడా ఇదే తరహా బంతిని ఎదుర్కోవడం సానుకూలాంశం. సాధారణ ఎరుపు బంతితో పోలిస్తే కూకాబుర్రా గులాబీ బంతి సాయంత్రం కాగానే భిన్నంగా స్పందిస్తోంది. ఒక్కసారిగా బంతి వేగం పెరుగుతుంది. గాల్లో స్వింగ్ కావడంతో పాటు పిచ్పై పడిన తర్వాత కూడా ఈ తేడా కనిపిస్తోంది. తొలి టెస్టుకు అందుబాటులో లేని డేవిడ్ వార్నర్కు డే అండ్ నైట్ టెస్టుల్లో మంచి అనుభవం ఉంది. ‘ట్రిపుల్ సెంచరీ' సహా గులాబీ మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన వార్నర్ చెప్పినట్లుగా.. పింక్ బాల్ను ఎదుర్కొనే విషయంలో కొంత సమయం ఇబ్బంది పడ్డా దానిని సానుకూలంగా కూడా మార్చుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. దానిని సరిగ్గా అంచనా వేయగలిగితే పరుగుల వరద పారుతుంది.

పేసర్లు ఓకే.. స్పిన్నర్లే..
ఆసీస్తో పోలిస్తే టీమిండిమా పేస్ బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. కానీ డే-నైట్ టెస్టుల అనుభవం విషయంలో ఆసీస్ బౌలింగ్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. 7 గులాబీ టెస్టులూ ఆడిన మిచెల్ స్టార్క్ 42 వికెట్లు తీస్తే 6 మ్యాచ్ల్లో హాజల్వుడ్ 28, ప్యాట్ కమిన్స్ 4 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ త్రయం భారత బ్యాట్స్మెన్ పని పట్టేందుకు సిద్ధంగా ఉంది.
అయితే అడిలైడ్లో పడిన మొత్తం వికెట్లలో పేస్ బౌలర్లే 101 తీయడం మన జట్టులో కూడా ఆశలు రేపుతోంది. కానీ స్పిన్ విభాగంలో మాత్రం ఆ్రస్టేలియా బౌలర్ నాథన్ లయన్ మినహా విదేశీ స్పిన్నర్లు ఎవ్వరూ కూడా ఇక్కడ రాణించలేదు. లయన్ ఒక్కడే 18 వికెట్లు తీయగా... ఇతర బౌలర్లెవరూ రెండు వికెట్లకు మించి తీయకపోవడం కలవరపెట్టే అంశం. కాబట్టి లయన్ నుంచి కూడా భారత్కు ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా తుది జట్టులో అశ్విన్, కుల్దీప్లలో ఎవరికి చోటిస్తుందో చెప్పలేం.

కలవరపెడుతున్న అనుభవలేమి..
రికార్డు చూస్తే పింక్ సమరంలో ఒక్క టెస్టులో మినహా ఆస్ట్రేలియా జట్టును ప్రత్యర్థి ఇబ్బంది పెట్టలేకపోయింది. ఆసీస్ రెండు మ్యాచ్ల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా, ఒక మ్యాచ్లో 296 పరుగులతో నెగ్గారు. ఏ విదేశీ జట్టు బ్యాటింగ్ సగటు కూడా ఒక్కో వికెట్కు 30 పరుగులకు మించి లేదు. ఒకసారి సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడం మినహా 13 ఇన్నింగ్స్ల్లోనూ ప్రత్యర్థి జట్లు ఆలౌట్ అయ్యాయి.
మొత్తంగా చూస్తే గులాబీ బంతితో డే-నైట్ టెస్టులు ఆడటంలో అనుభవలేమినే ఈ జట్లలో కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అదే కలవరపెడుతుంది. ఇలాంటి స్థితిలోనే పట్టుదల కనబర్చి సిరీస్లో శుభారంభం చేయాల్సి ఉంది.

ఆ సమయమే కీలకం!
పింక్ టెస్టులో సూర్యాస్తమయ సమయం కీలకం కానుంది. రెండో సెషన్ చివర్లో కొద్దిసేపు, మూడో సెషన్ ఆరంభంలో మరికొంత సేపు ఉండే ఈ సమయంలోనే బ్యాట్స్మన్ ఏకాగ్రత చెదరడం, ప్రత్యర్థి జట్టు వికెట్ల వేటలో పడటం కనిపిస్తున్నాయి. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా సరిగ్గా ఇదే మాట చెప్పాడు. ‘ఆ 40-50 నిమిషాల సమయంలోనే ఎంతో ఓపిక అవసరం. అప్పుడు బాగా ఆడగలిగితే ఆ తర్వాత తిరుగుండదు. కాబట్టి కొత్త ఆటగాడు వచ్చి ఇబ్బంది పడటంకంటే అప్పటికే క్రీజ్లో ఉన్న బ్యాట్స్మన్ పట్టుదల కనబరిస్తే మంచిది' అని రహానే అభిప్రాయపడ్డాడు.


Click it and Unblock the Notifications












