న్యూఢిల్లీ: కరోనా బాధితులకు సహాయం అందించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ ప్రారంభించిన 'ఇన్ దిస్ టుగెదర్' ఫండ్ రైజింగ్ క్యాంపైన్కు విశేషమైన స్పందన లంభించింది. వారం రోజుల్లోనే రూ.11 కోట్ల విరాళాలు వచ్చాయి. దాంతో ఈ క్యాంపైన్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తాము నిర్దేశించుకున్న రూ.11 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రకటించారు.
'మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా ఆశ్చర్యపోయాను. మేం తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా ఎక్కువ మొత్తం సేకరించడం గర్వంగా ఉంది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఇదిలాగే కొనసాగుతుంది. దేశ ప్రజలకు సహాయం చేయడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు. మీరు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. జై హింద్' అని అనుష్క, కోహ్లీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటివరకు రూ.11,39,11,820 విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కోహ్లీ, అనుష్క దంపతులు కెట్టో సంస్థతో కలిసి 'ఇన్ దిస్ టుగెదర్' పేరిట కొవిడ్-19 రిలీఫ్ కోసం ఫండ్ రైజింగ్ క్యాంపైన్ చేపట్టిన విషయం తెలిసిందే. ముందుగా విరుష్క దంపతులు తమ వంతుగా రూ.2 కోట్ల విరాళం అందించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రూ.7 కోట్ల విరాళాలు సేకరించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఎంపీఎల్ అనే క్రీడా సంస్థ వారికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ లక్ష్యాన్ని రూ.11 కోట్లకు పెంచుకున్నారు.