టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రిటిష్ పౌరసత్వం తీసుకోనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం లభించిన 40 రోజుల విశ్రాంతి సమయాన్ని లండన్లో కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నాడు.
అక్కడ కోహ్లీ ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో సొంతగడ్డపై టీమిండియా రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఈ టెస్ట్ సిరీస్తో విరాట్ కోహ్లీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. ఇక కోహ్లీ సాధారణ వ్యక్తిలా లండన్ వీధుల్లో బహిరంగంగా తిరిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోడ్డు దాటడం, రైల్వే స్టేషన్లలో గడపడం వంటి పలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

గత రెండేళ్లుగా లండన్లో మకాం!
విరాట్ కోహ్లీతో పాటు అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, ఇద్దరు పిల్లలు కూడా కనిపించారు. విశ్రాంతి సమయాన్ని కోహ్లీ.. లండన్లో గడపడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు అతను లండన్కు వెకేషన్కు వెళ్లాడు. అయితే గత రెండేళ్లుగా అతను తరుచూ లండన్కు వెళ్తున్నాడు. టీమిండియా సిరీస్లు ముగిసిన వెంటనే.. విశ్రాంతి లభిస్తే లండన్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు.
ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తన కెరీర్ ముగిసిన అనంతరం మైదానంకు దూరంగా వెళ్లిపోతానని, మళ్లీ ఎవరికి కనిపించనని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు కూడా కోహ్లీ లండన్ స్థిరపడతాడనే వార్తలకు బలం చేకూర్చుతున్నాయి.

కోహ్లీకి బ్రిటిష్ పౌరసత్వం..
ఇక విరాట్ కోహ్లీ బ్రిటిష్ పౌరసత్వం తీసుకుంటున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అతని అభిమానులు ఈ విషయంపై తీవ్రంగా చర్చిస్తున్నారు. ఒకవేళ విరాట్ కోహ్లీ బ్రిటిష్ పౌరసత్వం తీసుకుంటే భారత్ తరఫున ఆడగలడా..? నిబంధనలు ఎలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
ఐసీసీ రూల్స్ ప్రకారం జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలంటే ఆ దేశ పౌరసత్వం కలిగి ఉండాలి. లేదా ఆ దేశంలో జన్మించాలి. కనీసం ఆ దేశ పాస్ పోర్ట్ అయినా ఉండాలి. అప్పుడే ఆ దేశ జాతీయ జట్టు తరఫున ఆడేందుకు అనుమతి లభిస్తోంది. అయితే విరాట్ కోహ్లీ.. క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాతే భారత్ను వదిలి లండన్లో స్థిరపడుతాడని, మధ్యలో ఏం వెళ్లడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
భారత పౌరసత్వ చట్టాలు ఏంటంటే..?
భారత పౌరసత్వ చట్టాల ప్రకారం ఒకే వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాలను కలిగి ఉండటానికి ఎలాంటి అధికారిక నిబంధన లేదు. కానీ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు మాత్రం ఓవర్సీస్ సిటీజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డును పొందవచ్చు. ఈ కార్డు ద్వారా భారత్లో స్వేచ్చగా జీవించవచ్చు. కోహ్లీ యూకేలో స్థిరపడితే ఓసీఐ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది భారతీయ పౌరసత్వానికి ఏమాత్రం సమానం కాదు.
ప్రపంచ క్రికెట్లో చాలా మంది ఆటగాళ్లు ఇతర దేశాల పౌరసత్వం తీసుకొని ఆ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. ఐర్లాండ్కు చెందిన ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్కు ప్రపంచకప్ అందించాడు. సౌతాఫ్రికాకు చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్కు ఆడాడు. ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు.