టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలకు ఆయోధ్య రాముని ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు విరుష్క దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఆహ్వాన పత్రికను అందుకునేందుకు విరాట్ కోహ్లీ.. అఫ్గానిస్థాన్తో రెండో టీ20 ముగిసిన అనంతరం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వాన పత్రికను సతీమణితో స్వీకరించిన అనంతరం అతను చివని టీ20 జరిగే బెంగళూరుకు చేరుకున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది.

ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కొత్తగా నిర్మించిన అయోధ్య రామయ్య ఆలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు 10 వేల మందికి పైగా ప్రముఖులకు రామ జన్మ భూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్తో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్లకు కూడా అయోధ్య రాముని ఆహ్వానం అందింది.
ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర హీరోలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. మెగా స్టార్ చిరంజీవితో పాటు అతని తనయుడు రామ్ చరణ్, ప్రభాస్, మోహన్ బాబు, అక్కినేని నాగర్జున వంటి పలువురు హీరోలకు అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలిరావొచ్చని రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తోంది.