టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న తమకు కొడుకు పుట్టాడని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ కుమారుడికి అకాయ్(Akaay)అని పేరు పెట్లినట్లు తెలిపారు.
'మేం ఫిబ్రవరి 15న మా కుమారుడు అకాయ్ను ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోనే మధురమైన ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను కోరుకుంటున్నాం. మా ప్రైవసీని గౌరవించండి.'అని విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ రెండో సారి తండ్రి కాబోతున్నాడని గత 6 నెలలుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ విరుష్క ఈ విషయంలో సీక్రెట్ మెయింటేన్ చేసింది. తన రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకే విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ ఆడటం లేదని బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దాంతో అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
కోహ్లీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని ప్రచారం జరగ్గా.. అతని సోదరుడు వికాస్ కోహ్లీ ఖండించారు. తమ తల్లి ఆరోగ్యంగా ఉందని స్పష్టం చేశారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్.. కోహ్లీ రెండోసారి తండ్రి అవుతున్నాడని చెప్పి, అంతలోనే మాట మార్చాడు. దాంతో కోహ్లీ విరామంపై గందరగోళం నెలకొంది.
అయితే అనుష్క బేబీ బంప్కు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దాంతో కోహ్లీ రెండోసారి తండ్రి అవుతున్నాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే కోహ్లీ.. ఐదు రోజుల ఆలస్యంగా అసలు విషయాన్ని చెప్పాడు. విరుష్కకు జనవరి 11, 2021న వామిక జన్మనించింది. ఇప్పటి వరకు వామిక ఫొటోను మీడియాకు రిలీజ్ చేయలేదు.
తమ పిల్లలను బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచాలనుకుంటున్నామని, తమ ప్రైవసీని గౌరవించాలని మీడియా సంస్థలకు కోహ్లీ, అనుష్కలు లేఖ రాసారు. దాంతో వామిక ఫొటోలు బయటకు రాలేదు. ఇప్పుడు అకాయ్ కూడా మీడియాకు దూరంగానే పెరగనున్నాడు.