
కోహ్లీ మిస్సింగ్..
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత ఆటగాళ్లంతా సన్నదమవుతున్నారు. ఇటీవలే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను చేజార్చుకున్న విరాట్ కోహ్లీ పరుగులు చేయాలనే కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా సిద్దమవుతున్నాడు. ఎక్స్ ట్రా అవర్స్ నెట్స్లో ఉంటూ దిగ్గజ బ్యాట్స్మన్ సలహాలు తీసుకుంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి టీమిండియా బీబీక్యూ పార్టీ చేసుకుంది. అయితే ఈ పార్టీకి సగం మంది టీమిండియా ఆటగాళ్లు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

కోహ్లీ దూరంగా ఉన్నాడా?
ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెలెక్టర్లపై విరాట్ కోహ్లీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. దాంతో.. గుర్రుగా ఉన్న బీసీసీఐ.. సౌతాఫ్రికా జర్నీ సమయంలో తీసిన ఫొటోల్లో.. కోహ్లీ ఉన్న వాటిని మాత్రం పక్కనపెట్టింది. బీసీసీఐ తీరుపై మండిపడిన అభిమానులు.. 'కోహ్లీ మిస్సింగ్' అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా టీమిండియా బీబీక్యూ పార్టీకి కోహ్లీ దూరంగా ఉన్నాడా..? లేదా అతను ఉన్న ఫొటోల్ని భారత క్రికెటర్లు షేర్ చేసేందుకు ఇష్టపడటం లేదా? అనేది తెలియాల్సి ఉంది.

రెండు గ్రూప్లా?
బీబీక్యూ పార్టీలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, కోచింగ్ స్టాఫ్ ఉన్నారు. అలానే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్ కనిపించారు. కానీ.. కోహ్లీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఇటీవల ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఫొటోలో చతేశ్వర్ పుజారా మినహా.. అందులోని ఎవరూ ఈ పార్టీలో కనిపించలేదు. దాంతో.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రెండు గ్రూప్లు ఏర్పడ్డాయా? అనే సందేహం కలుగుతోంది. అయితే ఈ పార్టీకి కావాలనే కొందరు ఆటగాళ్లు రాలేదని, విరాట్ సైతం హోటల్ రూమ్కే పరిమితమయ్యాడని సమాచారం.

మరో నాలుగు రోజుల్లో..
డిసెంబర్ 26-30 వరకు సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. జనవరి 3-7 వరకు జోహన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్ట్, జనవరి 11-15 వరకు కేప్టౌన్లో మూడో టెస్ట్ జరగనుంది. జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ముందు షెడ్యూల్ ప్రకారం నాలుగు టీ20 సిరీస్ కూడా జరగాల్సి ఉండగా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ సిరీస్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ) ప్రకటించింది.


Click it and Unblock the Notifications
