ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు.
అయితే ఈ మ్యాచ్లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ చివరి ఓవర్లో టీమిండియా విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. తిలక్ వర్మ రెండో బంతిని సిక్సర్గా తరలించి విజయాన్ని ఖాయం చేయడంతో గంభీర్ వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. తన ముందున్న డెస్క్ను బలంగా కొడుతూ కనిపించాడు. ఈ సన్నివేశం టీవీ కెమెరాల్లో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా గంభీర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోడు. కానీ కోచ్గా మారిన తర్వాత ఆయన చాలా మౌనంగా కనిపించేవాడు. కానీ తాజా మ్యాచ్లో మాత్రం సంతోషాన్ని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ బల్లను గుద్దాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. సహిబ్జాద ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్(4/30)నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా.. శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 33), సంజూ శాంసన్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 24) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్(3/29) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.