
దుబాయ్: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. వరల్డ్ టెస్టుచాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో అయిదు దేశాలకు చెందిన పది మంది దిగ్గజాలకు ఐసీసీ.. హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించింది. తరానికి ఇద్దరికి చొప్పున అయిదు తరాల క్రికెటర్లను ఐసీసీ ఎంపిక చేసింది. 'క్రికెట్ చరిత్రలో ఈ పది మంది పాత్ర ఎంతో ముఖ్యమైంది. వీరి చేరికతో హాల్ ఆఫ్ ఫేమ్లో ఆటగాళ్ల సంఖ్య 103కు చేరింది'అని ఐసీసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
యుద్దానికి ముందు తరం(1946-1970)లో భాగంగా వినూ మన్కడ్, టెడ్ డెక్సటర్(ఇంగ్లండ్)కు చోటు కల్పించారు. ఈ ఇద్దరితో పాటు ఫాల్క్నర్ (దక్షిణాఫ్రికా), మాంటీ నోబుల్ (ఆస్ట్రేలియా), కాన్స్టంటైన్ (వెస్టిండీస్), స్టాన్ మెక్కేబ్ (ఆస్ట్రేలియా), డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్), బాబ్ విలిస్ (ఇంగ్లాండ్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), కుమార సంగక్కర (శ్రీలంక) ఉన్నారు.
భారత క్రికెట్లో గొప్ప ఆల్రౌండర్గా పేరున్న మన్కడ్.. 44 టెస్టుల్లో 2109 పరుగులు చేశాడు. అతను ఓపెనింగ్ బ్యాట్స్మన్. మన్కడ్ తన ఎడమచేతి వాటం స్పిన్తో 162 వికెట్లు పడగొట్టాడు. మన్కడ్ పేరిట బీసీసీఐ దేశవాళీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. దిగ్గజ క్రికెటర్ సంగక్కర శ్రీలంక తరఫున 134 టెస్టులు (12,400 పరుగులు), 404 వన్డేలు (14,234 పరుగులు), 56 టి20 మ్యాచ్లు (1,382 పరు గులు) ఆడాడు.