టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనకు ఎంతో సాయం చేశాడని, తానే అపార్థం చేసుకున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తెలిపాడు. సచిన్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ స్మారక కార్యక్రమంలో నిలబడేందుకూ కాంబ్లీ ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి అతనికి సాయం చేసేందుకు 1983 వన్డే ప్రపంచకప్ విజేత టీమ్ ముందుకు వచ్చింది. వినోద్ కాంబ్లీకి సాయం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, కానీ అతను రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లాలని 1983 ప్రపంచకప్ విజేత టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రకటించారు.

కపిల్ దేవ్ షరతుకు అంగీకరిస్తున్నట్లు తాజాగా వినోద్ కాంబ్లీ తెలిపారు. తన ఆరోగ్య స్థితి బాలేదన్నారు. ఈ క్రమంలోనే సచిన్తో ఉన్న సంబంధాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'సచిన్ను అపార్థం చేసుకోవడం వల్లే మా మధ్య విభేదాలు వచ్చాయి. సచిన్ నా కోసం ఏమీ చేయలేదని అనిపించింది. కానీ, సచిన్ నా కోసం చాలా చేశాడు. రెండు సర్జరీలు జరిగినప్పుడు బిల్లు మొత్తాన్ని అతనే చెల్లించాడు. మేమిద్దరం మళ్లీ మాట్లాడుకున్నాం.
చిన్ననాటి స్నేహం మళ్లీ మొదలైంది. కెరీర్ సమయంలోనూ సచిన్ నాకు చాలా సలహాలు ఇచ్చేవాడు. భారత జట్టులోకి నేను 9 సార్లు రీఎంట్రీ ఇచ్చాను. క్రికెటర్లకు గాయాలవ్వడం సహజం. వాటన్నింటిని తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. నా కెరీర్లో వాంఖడే స్టేడియంలో చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ మరిచిపోలేను.
నా క్రికెట్ ప్రయాణం సరిగ్గా సాగలేదు. సచిన్ వంటి స్నేహితుడు అండగా నిలిచాడు. నా ఫ్యామిలీ మద్దతు చెప్పలేనిది. ప్రస్తుతం నేను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నా. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఇచ్చిన ఆఫర్ను అంగీకరిస్తున్నా. కేవలం రూ. 30 వేలు ఫించను మీదే ఆధారపడుతున్నా. రిహాబిలిటేషన్కు వెళ్లేందుకు నేను రెడీ'అని వినోద్ కాంబ్లీ చెప్పుకొచ్చాడు.