యావత్ భారత్.. ఎంతో ఆతృతగా ఎదురు చూసిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్ తీర్పు మరోసారి వాయిదా పడింది. ఆగస్ట్ 16న తుది తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS)వెల్లడించింది. దాంతో భారతీయులంతా మరోసారి నిరాశకు గురయ్యారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసుకుంది. కానీ చివరి నిమిషంలో100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్ల్యూడబ్ల్యూ) రూల్స్ ప్రకారం.. డిస్క్వాలిఫై అయిన రెజ్లర్కు ఫైనల్ చేరినా చివరి ర్యాంక్ ఇస్తారు. దాంతో ఆమెకు ఏ పతకం రాకుండా పోయింది.

తన డిస్క్వాలిఫికేషన్ను సవాల్ చేస్తూ వినేష్ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు పూర్తవ్వగా తుది తీర్పు రావాల్సి ఉంది. అయితే CAS తీర్పు ఇప్పటికీ రెండు సార్లు వాయిదా పడింది. ఈ రోజు 9.30 గంటలకు తీర్పు వస్తుందని ఆశించిన వినేష్ ఫోగట్ అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఆగస్ట్ 16న రాత్రి 9.30 గంటలకు తుది తీర్పు వెల్లడిస్తామని CAS వెల్లడించింది. వినేష్ ఫోగట్కు అనుకూలంగా తీర్పు వస్తే ఆమెకు రజత పతకం దక్కనుంది.
వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ను ఓడించి..
తొలి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకి(జపాన్)ని మట్టికరిపించింది. రెండో రౌండ్లో ఉక్రెయిన్ ప్లేయర్ ఒక్సానా లివాచ్ను ఓడించింది. సెమీఫైనల్లో క్యుబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్ ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్తో వినేష్ ఫోగట్ తలపడాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఆమె 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది.
ఒకే రోజు మూడు మ్యాచ్లు..
వాస్తవానికి తన తొలి మ్యాచ్కు ముందు వినేష్ ఫోగట్ 49 కేజీల బరువు మాత్రమే ఉంది. రూల్స్ ప్రకారం ఆమె పోటీలకు అర్హత సాధించింది. కానీ ఒకే రోజు మూడు మ్యాచ్లు ఆడాల్సి రావడంతో ఎనర్జీ కోసం ఆమె ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆమె రెండు కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. వినేష్ ఫోగట్ మినహా మరే రెజ్లర్ అతి తక్కువ టైమ్ గ్యాప్లో మూడు మ్యాచ్లు ఆడలేదు.
అందుకే వారు బరువును కంట్రోల్లో ఉంచుకున్నారు. వినేష్ కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. చివరకు 100 గ్రాముల అదనపు బరువుతో ఆమె డిస్ క్వాలిఫై అయ్యింది. రెజ్లర్ల బరువు విషయంలో యూడబ్ల్యూడబ్ల్యూ నిబంధనలు కఠినంగా ఉన్నా.. ఒకే రోజు మూడు మ్యాచ్లు నిర్వహించాలనే నిబంధన లేదు.
కానీ ఒలింపిక్ కమిటీ ఒత్తిడితో ఒకే రోజు మూడు రెజ్లింగ్ మ్యాచ్లు ఆడించారు. ఇదే పాయింట్ను వినేష్ ఫోగట్ తరఫున లాయర్లు CASలో వాదించినట్లు తెలుస్తోంది.