భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కన్నీటి పర్యంతమైంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన వినేష్ ఫోగట్కు న్యాయ పోరాటంలోనూ నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. శనివారం భారత్కు చేరుకున్న ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పతకం లేకుండా వచ్చినా.. ఆమెకు స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు, సహచర రెజ్లర్లు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ అపూర్వ స్వాగతాన్ని చూసి వినేష్ ఫోగట్ భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. పతకం సాధించకున్నా.. భారత ప్రజల మనసులు గెలుచుకున్నారని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వినేష్ ఫోగట్కు స్వాగతం పలికారు. సహచర రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్లు ఆమెకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదం చేసుకుంటూ వినేష్ ఫోగట్ ముందుకు కదిలారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసుకుంది. కానీ చివరి నిమిషంలో100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్ల్యూడబ్ల్యూ) రూల్స్ ప్రకారం.. డిస్క్వాలిఫై అయిన రెజ్లర్కు ఫైనల్ చేరినా చివరి ర్యాంక్ ఇస్తారు. దాంతో ఆమెకు ఏ పతకం రాకుండా పోయింది. తుది పోరుకు అర్హత సాధంచే క్రమంలో తాను ఎలాంటి తప్పిదం చేయలేదని, సంయుక్త రజత పతకం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS)ను వినేష్ ఫోగట్ ఆశ్రయించింది.
అప్పీల్ను స్వీకరించిన కాస్.. వినేష్ ఫోగట్ తరఫున లాయర్ల వాదనలు వినింది. ముందుగా ఆగస్ట్ 13న తమ తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఆగస్ట్ 16కు వాయిదా వేసింది. దాంతో వినేష్ ఫోగట్కు రజత పతకం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ వినేష్ ఫోగట్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు అడహక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ బుధవారం(ఆగస్ట్ 16)న తీర్పునిచ్చారు. దాంతో పతక ఆశలు ఆవిరయ్యాయి. న్యాయ పోరాటం కూడా ముగియడంతో వినేష్ ఫోగట్ పారిస్ వదిలి స్వదేశానికి చేరుకుంది.
VINESH PHOGAT in tears after the huge reception from the family, mates & fans at Delhi. ❤️ pic.twitter.com/Rk46khX5oz
— Johns. (@CricCrazyJohns) August 17, 2024