భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వేదికగా ఈ ఏడాది అత్యధికమంది సెర్చ్ చేసిన భారత వ్యక్తుల్లో వినేష్ ఫోగట్ టాప్లో నిలిచారు. అత్యధిక మంది వినేష్ ఫోగట్ కోసం గూగుల్ను ఆశ్రయించారు.
ఈ ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో గూగుల్ తమ టాప్ ట్రెండింగ్స్ను విడుదల చేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత స్టార్ రెజ్లర్లు చేపట్టిన ఉద్యమంలో వినేష్ ఫోగట్ చురుకుగా పాల్గొన్నారు.

ఈ ఉద్యమం భారత రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్ తృటిలో బంగారు పతకాన్ని చేజార్చుకున్నారు. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసుకున్న వినేష్ ఫోగట్ ఫైనల్కు ముందు అనర్హత వేటుకు గురయ్యారు.
నిర్ణీత బరువు కన్నా 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో వినేష్ ఫోగట్ను డిస్క్వాలిఫై చేశారు. దీనిపై ఆమె న్యాయ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. దాంతో ఒలింపిక్ మెడల్ సాధించాలనే వినేష్ ఫోగట్ కల నెరవేరలేదు. ఒలింపిక్స్ అనంతరం రెజ్లింగ్కు వీడ్కోలు పలికిన వినేష్ ఫోగట్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దాంతోనే ఈ ఏడాదంతా వినేష్ ఫోగట్ వార్తల్లో నిలిచారు. దాంతో ఆమె పేరు టాప్ మోస్ట్ సెర్చ్డ్ జాబితాలో నిలిచింది.
వినేష్ ఫోగట్ తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురించి నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేశారు. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 వ్యక్తుల జాబితాల్లో వినేష్ ఫోగట్, నితీష్ కుమార్తో పాటు చిరాగ్ పస్వాన్, హార్దిక్ పాండ్యా, టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శశాంక్ సింగ్, పూనమ్ పాండే, రాధికా మర్చంట్, అభిషేక్ శర్మ, లక్ష్యసేన్లు ఉన్నారు. క్రీడల నుంచి వినేష్ ఫోగట్తో పాటు హార్దిక్ పాండ్యా, శశాంక్ సింగ్, అభిషేక్ శర్మ, లక్ష్యసేన్లు చోటు దక్కించుకున్నారు.