న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకు ధోనీ దూరమవగా.. అతని స్థానంలో రిషబ్ పంత్కు సెలక్టర్లు వరుస అవకాశాలిచ్చారు. కానీ పంత్ మాత్రం టీమ్మేనేజ్మెంట్ అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను పరీక్షించగా అతను ఊహించని రీతిలో రాణించాడు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన న్యూజిలాండ్ పర్యటనలో పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు.
అయితే రాహుల్తో పోలిస్తే రిషభ్ పంత్కే టీమ్ మేనేజ్మెంట్ ఎక్కువ సపోర్ట్ ఇస్తోందని విక్రమ్ రాథోడ్ స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'రిషబ్ పంత్ గతేడాది గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయాడు. అయినప్పటికీ టీమిండియా మేనేజ్మెంట్ అతనికి సపోర్ట్గా నిలుస్తుంది. దానికి కారణం పంత్ స్పెషల్ ప్లేయర్ అని నమ్మడమే. ఒక్కసారి అతను టచ్లోకి వస్తే ఆ తర్వాత నిలకడగా పరుగులు రాబట్టగలడు. ఇక జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. దానికితోడు వరుస వైఫల్యాల కారణంగా రిషబ్ పంత్ ఒత్తిడిలో ఉన్నాడు. కానీ ఇలాంటి ఎదురుదెబ్బలే అతడ్ని మెరుగైన ఆటగాడిగా తీర్చిదిద్దుతాయి'అని విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.
ఈ సీజన్ ఐపీఎల్లో ఫామ్ నిరూపించుకోవాలని ధోనీతో పాటు రిషబ్ పంత్ కూడా ఆశించాడు. తద్వారా ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్ ఆడాలనుకున్నారు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది.
మాలిక్.. పాకిస్థాన్ మొత్తానికి సానియా మీర్జా వదిననే!