న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్గిల్పై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో గిల్ టీమిండియాను ఏలుతాడని తెలిపాడు. అతని ప్రతిభపై తనకు ఎలాంటి సందేహం లేదన్నాడు. వెస్టిండీస్తో తొలి టెస్ట్లో ఫస్ట్ డౌన్లో బరిలోకి దిగిన శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు.
11 బంతుల్లో 6 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో చెలరేగిన వికెట్పై శుభ్మన్ గిల్ విఫలమవ్వడం.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతోనే శుభ్మన్ గిల్ విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి. అతన్ని మళ్లీ ఓపెనర్గానే ఆడించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన విక్రమ్ రాథోడ్.. ఒక్క ఇన్నింగ్స్తో శుభ్మన్ గిల్ బ్యాటింగ్పై ఒక అభిప్రాయానికి రావడం సరికాదన్నాడు. 'జట్టులో ముగ్గురు ఓపెనర్లు ఉంటే ఎవరో ఒకరు నంబర్ 3లో ఆడాల్సిందే. ఇక శుభ్మన్ గిల్కు ఫస్ట్ డౌన్లో ఆడిన అనుభవం ఉండటంతో అతనికే ఆ స్థానాన్ని కేటాయించాం.
దేశవాళీ క్రికెట్లో పంజాబ్ తరఫున, భారత్ ఏ జట్టు తరఫున శుభ్మన్ గిల్ 3, 4 స్థానాల్లోనే ఆడుతాడు. ఒక్క ఇన్నింగ్స్తో అతని బ్యాటింగ్పై ఓ అభిప్రాయానికి రావడం సరికాదు. సత్తా చాటేందుకు అతనికి చాలా సమయం ఉంది. అతనికి అపారమైన నైపుణ్యంతో పాటు టెంపర్మెంట్ ఉంది. పరిస్థితులకు తగ్గట్లు దూకుడుగా ఆడే సామర్థ్యం ఉంది.
అతని విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో టీమిండియా బ్యాటింగ్ను అతను శాసిస్తాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం పాటు అతను ఆడుతాడు.'అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
తొలి టెస్ట్లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ సెంచరీలకు తోడుగా అశ్విన్ 12 వికెట్లతో సత్తా చాటడంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగులతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ గురువారం(జూలై 20) నుంచి ప్రారంభం కానుంది.