
మాకు మంచి రోజులూ వస్తాయి
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం నాలుగో రోజు ఆట ముగిశాక టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ మీడియాతో మాట్లాడాడు. విదేశాల్లో భారత బ్యాట్స్మెన్ పదేపదే విఫలమవ్వడం తనపై ఒత్తిడి పెంచుతోందా అని ప్రశ్నించగా.. రాఠోడ్ లేదని జవాబిచ్చాడు. 'ఈ విషయంలో మేం చాలా శ్రమిస్తున్నాం. కుర్రాళ్లతో కలిసి కఠినంగా కృషి చేస్తున్నాం. మెరుగ్గా సాధన చేస్తుంటే, అత్యుత్తమంగా ఆడుతుంటే ఫలితాలు వాటంతటవే వస్తాయి. మాకు మంచి రోజులూ వస్తాయి. మా బ్యాట్స్మన్ పరుగులు సాధిస్తారు' అని రాఠోడ్ ధీమా వ్యక్తం చేశాడు.

గడ్డు దశ ఎదురవుతుంటుంది
'క్రికెట్లో బ్యాట్స్మెన్కు అప్పుడప్పుడు గడ్డు దశ ఎదురవుతుంటుంది. ఎవరైనా సరే వాటిని అనుభవించి తీరాల్సిందే. తీవ్రంగా కృషి చేస్తూ ప్రక్రియపై దృష్టిసారిస్తే సహాయ సిబ్బంది సహకారంతో దాని నుంచి బయటపడొచ్చు. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు.
ఎవరైనా కష్టపడ్డా, విఫలమైనా మేమూ వారి బాధను అర్థం చేసుకుంటాం. మా బ్యాట్స్మెన్పై పూర్తి నమ్మకముంది. వారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. చాలా కష్టపడుతున్నారు. త్వరలోనే పరుగుల వరద పారుతుంది. మీరు చూడండి.. ఇదే జరుగుతుంది' అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ పేర్కొన్నాడు.
Ian Chappel: 'టెస్ట్ ఫార్మాట్ను కాపాడాలనుకుంటే.. విరాట్ కోహ్లీని ప్రతినిధిగా చేయండి'

రోహిత్కు సూచిస్తాం
కుర్రాళ్లపై వ్యక్తిగతంగానూ దృష్టిసారిస్తామని విక్రమ్ రాఠోడ్ తెలిపారు. పుల్ షాట్ను మరింత నిక్కచ్చిగా ఎంపిక చేసుకోవాలని రోహిత్ శర్మకు సూచించామన్నారు. 'విశ్లేషణ చేస్తాం. ఔటైన ప్రతిసారీ మాట్లాడతాం. అప్పుడెలా ఆలోచించారు? ఎలాంటి షాట్ ఆడాలనుకున్నారో తెలుసుకుంటాం.
ఉదాహరణకు పుల్ షాట్ ద్వారా రోహిత్ ఎక్కువ పరుగులు చేస్తాడు. కానీ ఎక్కువ సార్లు ఔటయ్యేదీ అదే షాట్కు. అందుకే మరింత స్పష్టతతో ఆ షాట్ ఆడాలని అతడికి సూచించాం. ఇక విరాట్ కోహ్లీ ఏకాగ్రత కోల్పోవడంతోనే రెండో ఇన్నింగ్స్లో ఔటయ్యాడు. మరేం సమస్యలు లేవు. ఐదో రోజు బంతి ఎలా స్పందిస్తుందో చూడాలి. 200లకు పైగా లక్ష్యం నిర్దేశిస్తే ఇంగ్లండ్కు ఆఖరి రోజు కష్టమే' అని రాఠోడ్ చెప్పుకొచ్చాడు.

154 పరుగుల ఆధిక్యంలో భారత్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చివరి అంకానికి చేరుకుంది. మ్యాచ్లో నాలుగో రోజైన ఆదివారం 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీసేన.. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 154 పరుగులుగా ఉంది. క్రీజులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (14 బ్యాటింగ్: 29 బంతుల్లో), సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్: 10 బంతుల్లో) ఉన్నారు. పంత్ ఆటలో చివరి రోజైన సోమవారం ఉదయం తొలి సెషన్లో స్కోరు చేయడంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.


Click it and Unblock the Notifications












